హనుమకొండ, జూలై 1: కాకతీయుల ఘన చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు ‘కాకతీయ సస్తాహం’ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. ఈ నెల 7నుంచి వారంపాటు కొనసాగే కాకతీయ ఉత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి హనుమకొండ పద్మాక్షికాలనీలోని అగ్గలయ్య గుట్టను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ కాకతీయుల సెంటిమెంట్గా భావించే 7 నంబర్ ఆధారంగా 7వ నెల 7వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు వేడుకలు జరుపుతామన్నారు.
ఉత్సవాల్లో భాగంగా కాకతీయ కట్టడాలైన జైన్ సైట్స్, సిద్ధులగుట్ట తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. 700 సంవత్సరాల తర్వాత కాకతీయుల 22వ వారసుడు ప్రస్తుత బస్తర్ మహారాజు కమల్ చంద్ర భంజ్దేవ్ ఉత్సవాలకు వస్తున్నారని, వారి తాత ముత్తాతలు నడియాడిన నేల విశిష్టతను వారికి వివరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఉత్సవాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి కేటీఆర్ సైతం ఆదేశించారని పేర్కొన్నారు. యుద్ధానికి, శుభకార్యాలకు తమ వాళ్లు వెళ్లినప్పుడు భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని బయలుదేరే వారని కమల్ చంద్ర భంజ్దేవ్ గుర్తు చేశారని, ఉత్సవాలకు వస్తున్న సందర్భంలో ముందుగా ఆయన కూడా భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు. రెండు మూడు రోజుల్లో కార్యక్రమాల పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వా తే కాకతీయుల నిర్మాణాలను, చెరువులను టీఆర్ఎస్ ప్రభుత్వం పునరుద్ధరించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిందన్నారు.
కాకతీయులు నిర్మించిన త్రికూటాలయాలు తెలంగాణకే గర్వకారణని, వాటిని పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. వారి వెంట కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, ఇంటాక్ బాధ్యులు పాండురంగారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, పలు డివిజన్ల కార్పొరేటర్లు ఉన్నారు.
హనుమకొండ చౌరస్తా : కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొత్త భవన నిర్మాణానికి కృషి చేస్తానని బోయినపల్లి హామీ ఇచ్చారు. హనుమకొండలోని కేడీసీని చీఫ్విప్ దాస్యంతో కలిసి సందర్శించారు. ప్రతిష్టాతక విద్యాకేంద్రంగా ఉన్న కాకతీయ ప్రభుత్వ కళాశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు. గోల్డెన్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని మరోసారి న్యాక్ గుర్తింపునకు వెళ్తు న్న సందర్భంగా పూర్వవిద్యార్థుల సం ఘం ప్రోత్సాహంతో కళాశాలను సందర్శించినట్లు తెలిపారు.
పాతభవనాన్ని కూల్చివేసి మైదానంలో కొత్తభవనం కోసం ప్రతిపాదన లు సిద్ధం చేయాలన్నారు. క్యాంటీన్ నిర్మాణం కోసం కలెక్టర్ రూ.6.5లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. కళాశాలప్రగతి, సమస్యలను ప్రిన్సిపాల్ రాజారెడ్డి వివరించారు. ఇక్కడ పూర్వవిద్యార్థుల సంఘాల ప్రధాన కార్యదర్శి సోమిరెడ్డి ఉన్నారు.