గ్రామాల్లో ప్రగతి పరిఢవిల్లుతున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో ఊళ్లల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సర్కారు విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ నెక్కొండ మండలంలోని దీక్షకుంట గ్రామం సౌకర్యాలను మెరుగుపరుచుకుంటున్నది. గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పల్లె ప్రకృతి వనం పచ్చని మొక్కలతో ఆహ్లాదపరుస్తున్నది. రైతు సమస్యల కోసం రైతు వేదిక, చివరి మజిలీ కోసం వైకుంఠధామం, చెత్త తరలింపునకు డంపింగ్ యార్డు.. ఇలా ఒక్కొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకుంటున్నది. గ్రామీణ యువత, క్రీడాకారుల కోసం క్రీడా ప్రాంగణం రూపు దిద్దుకుంటున్నది. ‘మన ఊరు-మన బడి’ ద్వారా పాఠశాలల్లో వసతులు సమకూర్చుకుంటున్నది.
నెక్కొండ, జూలై 1: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పథకంతో పల్లెల్లో సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. పల్లె ప్రగతి నిధులను సద్వినియోగం చేసుకుంటూ దీక్షకుంట గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఈజీఎస్ నిధులు రూ. 22 లక్షలతో రైతు వేదికను నిర్మించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగు విధానంలో మెలకువలు, వ్యవసాయ అధికారుల సూచనలు, శిక్షణకు ఈ వేదిక ఉపయోగపడుతున్నది. ఈజీఏస్ నిధులు రూ. లక్షతోపాటు, జీపీ నిధులు రూ.3,70,000లు కలుపుకొని వివిధ రకాల మొక్కలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఈజీఎస్ నిధులు రూ. 2.50 లక్షతో డంపింగ్ యార్డ్ను నిర్మించారు.
ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.36 లక్షలతో 700 మీటర్ల మేర సీసీ రోడ్లను నిర్మించారు. జీపీ నిధులు రూ. 23 లక్షలతో 500 మీటర్ల మేర సీసీ రోడ్లను నిర్మించారు. గ్రామ పంచాయతీ నిధులు రూ.5.35లను వెచ్చించి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీలను కొనుగోలు చేశారు. దీంతో చెత్త తరలింపునకు అయ్యే ఖర్చులు ఆదా అవడంతో పాటు హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు ట్యాంకర్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రభుత్వం తాజాగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా రూ. 13లక్షలను వెచ్చించి పాఠ శాలల్లో మౌలిక వసతులను సమకూర్చి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా తెలం గాణ క్రీడా ప్రాంగణం రూపుదిద్దుకొంది. గ్రామంలోని యువత, విద్యార్థులు క్రీడల్లో శిక్షణ నిచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రూ. 22 లక్షలతో నెక్కొండ ప్రాథమిక సహకారం సంఘం ఆధ్వర్యంలో సొసైటీ కాంప్లెక్స్, రూ. 14 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్రం భవనాన్ని నిర్మిస్తున్నారు. కాకతీయుల కాలంలో గ్రామంలో నిర్మించిన మూడు గొలుసుకట్టు చెరువులకు మిషన్ భగీరథ పథకంలో మరమ్మతులు చేశారు. దీంతో దాదాపు 1300 ఎకరాల్లో పంట పొలాలకు సాగునీరు పుష్కలంగా అంది రెండుపంటలు సాగవుతున్నాయి. ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సహకారంతో సర్పంచ్ ఆలకుంట సురేందర్, ఉపసర్పంచ్ ముడుసు ఎల్లమ్మ, ఎంపీటీసీ లింగాల అజయ్, వార్డుసభ్యులు, అధికారులు గ్రామాభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు.
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సహకారంతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. పంచాయతీ పాలకవర్గం, అధికారం యంత్రాంగం, గ్రామ పెద్దల సహకారంతో పల్లె ప్రగతి, ఎన్ఆర్ఈజీఎస్ నిధు లను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. పచ్చదనం, పరిశుభ్రత, సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఇంకా నిధులు అవసరం ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్న కాకతీయుల కాలంలో నిర్మించిన రెండు ఆలయాలను అభివృద్ధి పరిచేందుకు నిధులు మంజూరు చేయాలి. ఈ దిశగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సి ఉంది.
– ఆలకుంట సురేందర్, సర్పంచ్, దీక్షకుంట