కాంగ్రెస్, బీజేపీ కట్టెల యుద్ధంతో హంటర్రోడ్డులోని బీజేపీ హనుమకొండ జిల్లా కార్యాలయం వద్ద శుక్రవారం గంటపాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు వీధిరౌడీల్లా కర్రలతో కొట్టుకోవడం రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా స్తంభించిపోయి ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది.
వరంగల్, జూలై 1: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు, కార్యకర్తలు వీధి రౌడీల్లా కర్రలతో కొట్టుకున్నారు. హనుమకొండ బీజేపీ కార్యాలయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఇరువర్గాలవారు ఆగ్రహంతో ఊగిపోతూ కట్టెలతో దాడికి దిగడంతో స్థానికులు ఆందోళన చెందారు. నగరంలోని ప్రధాన రహదారి హంటర్రోడ్డుపై పరస్పర దాడులు చేసుకోవడంతో పాటు నిలువరించేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా దాడికి తెగబడ్డారు.
ఇరు పార్టీల కొట్లాటలో పోలీసులు సైతం గాయపడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కర్రలతో ఫైటింగ్కు దిగడంతో దారిన పోయేవారు భయంతో పరుగులు పెట్టారు. వ్యాపారులు తమ షాపులను మూసివేసుకున్నారు. సుమారు గంట పాటు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు చేసిన వీరంగం నుంచి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు.
రాజస్థాన్కు చెందిన బీజేపీ ఎంపీ ఓంప్రకాశ్ మాథుర్ నగరానికి వచ్చిన సమాచారం తెలిసి కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కేంద్రం కొత్తగా తెచ్చిన ఆగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కార్యకర్తలలో కాలిసి వాహనాల్లో వచ్చారు.
బీజేపీ కార్యాలయానికి కొద్ది దూరంలో వాహనాలను ఆపి కార్యకర్తలతో కలిసి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చారు. బీజేపీ హనుమకొండ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా వచ్చిన ఓం ప్రకాశ్ మాథుర్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్న సమయంతో కాంగ్రెస్ కార్యకర్తలు కార్యాలయ ముట్టడికి రావడంతో బీజేపీ కార్యకర్తలు ఆవేశంతో కర్రలు పట్టుకొని వచ్చారు.
ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలపై కర్రలతో దాడికి తెగబడ్డారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుల వాహనాలను ధ్వంసం చేశారు. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు చేతిలో ఉన్న జెండా కర్రలతో ప్రతి దాడులకు దిగారు. దీంతో ఒక్క సారిగా హంటర్ రోడ్డులోని బీజేపీ కార్యాలయ ప్రాంతం రణరంగంలా మారింది. పోలీసులు నిలువరించేందుకు విఫలయ త్నం చేశారు. ఇరు పార్టీల కార్యకర్తల దాడుల్లో పోలీసులకు గాయాలయ్యాయి. చివరికి పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సుబేదారి : డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతోపాటు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసిన నాయకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సుబేదారి సీఐ రాఘవేందర్ తెలిపారు.