వరంగల్, జూలై 1(నమస్తేతెలంగాణ) : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని బీజేపీలో నిరసన గూడు కట్టుకున్నది. నాయకత్వం తీరుపై పార్టీ శ్రేణు లు పలు వేదికలపై తమ నిరసన వెలిబుచ్చుతున్నా రు. ఇటీవల వరంగల్లో జరిగిన పార్టీ సమావేశంలో ఒక వర్గం కార్యకర్తలు తమను పట్టించుకోవడం లేదని, వివక్ష ప్రదర్శిస్తున్నారని నాయకత్వంపై విరుచుకుపడ్డారు. దీంతో బీజేపీలో వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. గురువారం వరంగల్ శివనగర్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన వరంగల్ తూర్పు నియోజకవర్గ ఓబీసీ మోర్చా, బీజేవైఎం సమావేశంలో బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ప్రసాద్తో పాటు పలువురు నేతల సమక్షంలో క్రిస్టియన్కాలనీ, ఉర్సుకు చెందిన దళిత మోర్చా కార్యకర్తలు నాయకత్వం తీరుపై తీవ్ర స్థాయి లో నిరసన వ్యక్తం చేశారు.
దళిత, మహిళా మోర్చా కార్యకర్తలను పార్టీ నాయకత్వం గుర్తించడం లేదని, ఫ్లెక్సీల్లో కనీసం ఫొటోలు కూడా పెట్టకుండా వివక్ష కనబరుస్తున్నదని సమావేశాన్ని బహిష్కరించారు. తర్వాత తమ నిరసనకు కారణాలను ఎంపీ రవిశంకర్ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తూర్పు నియోజకవర్గంలోని 27వ డివిజన్ గోవిందరాజుల గుట్టకింది ప్రాంతానికి చెందిన బ్రదర్స్ చింతాకుల అనిల్, సునీల్ కమలనాథులకు షాక్ ఇచ్చారు. బీజేపీకి గుడ్బై చెప్పి కారు ఎక్కారు.
అనిల్ ప్రస్తుతం 27వ డివిజన్ కార్పొరేటర్. సునీల్ గతంలో బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. తూర్పు బీజేపీలో వీరిద్దరు కీలక వ్యక్తులు. మొదటి నుంచి బీజేపీలో పనిచేశారు. కాగా, శుక్రవారం హైదరాబాద్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో అనిల్, సునీల్ బీజేపీకి స్వస్తి పలికి టీఆర్ఎస్లో చేరారు. గులాబీ కండువా కప్పి వీరిని మంత్రి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, తూర్పు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతలు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక, తెలంగాణపై ఆయన చూపుతున్న వివక్షకు నిరసనగా తాము బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరినట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ నాయకత్వం, మంత్రి కేటీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. హైదరాబాద్ పర్యటనకు ప్రధాని మోదీ శనివారం రానున్న తరుణంలో వీరు తమ అనుచరులతో టీఆర్ఎస్లో చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానంగా అనిల్, సునీల్ మొదటి నుంచి తాము పనిచేసిన బీజేపీని వదలడం, అభివృద్ధిని కాంక్షిస్తూ కారెక్కడం ఆసక్తికర చర్చకు దారితీసింది. అంతేకాదు బీజేపీ కేడర్లో నెలకొన్న నిరసన, నాయకత్వం వివక్ష మరోసారి బయటపడింది.