కొత్తగూడ, జూన్ 30 : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలు కాపీ కొట్టి వారి రాష్ర్టాల్లో అమలు చేయాలని చూస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మండల కేంద్రంలో పర్యటించారు. మొదట గుంజేడు ముసలమ్మ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంలోని బీఆర్ అంబేద్కర్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
నిధుల కేటాయింపు, సంక్షేమ పథకాల అమలు, ప్రాజెక్టుల నిర్వహణకు కేంద్రం ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కట్టకుండా ఆదివాసీ గిరిజనుల ఉపాధిని కాలరాస్తున్నదని మండిపడ్డారు. గిరిజన యూనివర్సిటీని కేటాయించి అందులో గిరిజనులకు 7 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తే వారికి ఎలా న్యాయం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ గ్రామాల్లో పోడు సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అయినా, సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడ, గంగారం మండలాల్లో నూతన రోడ్ల నిర్మాణానికి ఫారెస్టు అనుమతుల కోసం మంత్రి కేటీఆర్తో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. అనంతరం పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరగా, ఎంపీ కవిత కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీరవెల్లి భరత్కుమార్రెడ్డి, ఓడీసీఎంఎస్ వైస్ చైర్మన్ దేశిడి శ్రీనివాస్రెడ్డి, మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు, మంగపేట మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ, మండల అధికార ప్రతినిధి జవహర్లాల్ నెహ్రూ, సంతోషారాణి, అజ్మీ రా రమేశ్నాయక్, రమేశ్రాథోడ్, ఈసం సమ్మయ్య, ఇర్ప సూరయ్య పాల్గొన్నారు.