వరంగల్, జూన్ 30 : భద్రకాళి దేవాలయంలో శాకంబరీ మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్- రేవతి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. తొలి రోజు భద్రకాళి అమ్మవారిని కామేశ్వరిగా అలంకరించి పూజలు చేశారు. వైద్యులు రాజేశ్వరప్రసాద్, లలితాదేవి దంపతుల సౌజన్యంలో సహస్ర కలశాభిషేకాలు నిర్వహించారు. భద్రకాళిని నగర మేయర్ గుండు సుధారాణి, భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.
భద్రకాళి శాకంబరీ ఉత్సవాలు ఈనెల 13 వరకు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో శేషుభారతి, ప్రధాన అర్చకుడు శేషు తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆషాఢ పౌర్ణమి రోజు అమ్మవారు శాకంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు. దేశంలో ఒక్క భద్రకాళి ఆలయంలోనే శాకంబరీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారని తెలిపారు.