కాంగ్రెస్లో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. రచ్చబండ సందర్భంగా నాయకుల మధ్య విభేదాలు బయటపడడంతో శ్రేణుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి వర్గీయులు ఎవరికి వారే అన్నట్లుగా కార్యక్రమాలు నిర్వహించడం పార్టీ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. కొంతకాలంగా వీరి మధ్య అంతర్యుద్ధం కొనసాగుతుండడం.. తాజాగా రాహుల్ పర్యటన తర్వాత రచ్చబండ కార్యక్రమంతో జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు ముక్కులుగా చీలిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అగ్రనేతల మధ్య నెలకొన్న వివాదంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం, ఆందోళన నెలకొన్నాయి.
జనగామ, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : గత సాధారణ ఎన్నికల నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నడుస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోటీచేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా జరిగిన ఎన్నికల్లో ఆయన టీ పీసీసీ చీఫ్ హోదాలో ఘోర పరాజయం పాలయ్యారు.
తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యం లో పార్టీ అధిష్టానం ఆయన్ను టీ పీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ క్రమంలో గత సాధారణ ఎన్నికల్లో ఆయనకు జనగామ టికెట్ ఇవ్వొద్దని ఓ వర్గం అధిష్టానం ముందు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించింది. పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం టికెట్ ఇవ్వాలనే డిమాండ్లు వ్యక్తమయ్యాయి. మొత్తం మీద బీ-ఫారం ఇచ్చే నాటికి సీన్ మారడంతో పొన్నాలకే టికెట్ దక్కింది. అయినప్పటికీ ఆయన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఎన్నికల తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జంగా రాఘవరెడ్డిని అధిష్టానం నియమించింది. దీంతో పొన్నాల పట్టుబట్టి తన వర్గీయుడికి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇప్పించుకున్నారు.
అప్పటివరకు ఒకటిగా ఉన్న పార్టీ కార్యాలయం దీంతో రెండుగా చీలింది. జిల్లా కార్యాలయం ఉన్నప్పటికీ పొన్నాల లక్ష్మయ్య మరోచోట మరో కార్యాలయం ఏర్పాటుచేశారు. ఉత్తమ్కుమార్రెడ్డి టీపీసీసీ నేతగా ఉన్నన్ని రోజులు పార్టీలో జంగా హవా కొనసాగగా, ఆ తర్వాత రేవంత్రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టడంతో మారిన రాజకీయ సమీకరణాలు, పరిణామాలతో పట్టణ, మండల, నియోజకవర్గ కమిటీల నియామకాల్లో పొన్నాల సిఫార్సు చేసిన వారికి కీలక పదవులు దక్కాయి. అప్పటికే పార్టీలో వర్గపోరు కొనసాగుతుండగా ఈ నియామకాల తర్వాత తారస్థాయికి చేరింది. దీంతో పార్టీపరంగా ఏ కార్యక్రమం చేపట్టినా కొద్దినెలలు ఎక్కడివారు అక్కడే నిర్వహిస్తూ వచ్చారు.
హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ సమావేశంలో మండల కమిటీల నియామకంపై పార్టీ పెద్దల సమక్షంలోనే గొడవకు దిగడంతో టీపీసీసీ క్రమశిక్షణ సంఘం జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి సహా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, మాజీ కౌన్సిలర్ మేడె శ్రీనివాస్కు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. తర్వాత జరిగిన పరిణామాలతో డీసీసీ అధ్యక్షులు జంగా రాఘవారెడ్డి హనుమకొండ నియోజకవర్గ టికెట్ ఆశిస్తూ కొద్దినెలలుగా జనగామలో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన వర్గీయులుగా కొనసాగిన నాయకులు, కార్యకర్తలు డోలాయమానంలో పడ్డారు.
జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మూడు ముక్కలాటలా ఉంది. మొన్నటివరకు పొన్నాల, జంగా, కోమటిరెడ్డి గ్రూపులు ఉండగా, రచ్చబండ కార్యక్రమంతో కొత్తగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి వర్గం చురుగ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. జిల్లా రాజకీయాల నుంచి జంగా ‘యూటర్న్’ తీసుకోవడం, ఎంపీ కోమటిరెడ్డి జనగామపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో జంగా, కోమటిరెడ్డి వర్గీయులుగా ఉన్న నాయకులు ఎటుపోవాలో.. ఏ వర్గంలో ఉండాలో తెలియని అయోమయ పరిస్థితిలో కొద్దిరోజుల క్రితం ఆర్అండ్బీ అతిథిగృహంలో సమావేశమయ్యారు.
స్థానికుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని టీపీసీసీ అధ్యక్షుడిని కోరాలని నిర్ణయించుకున్నా.. పార్టీ చీఫ్ను కలువకుండా స్తబ్దుగా ఉండిపోయారు. తాజాగా పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమం నియోజకవర్గంలో మళ్లీ వర్గపోరుకు ఆజ్యం పోసినట్లయింది. జనగామ నియోజకవర్గంలో మాజీ మంత్రి పొన్నాల ఒకవైపు, చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి మరోవైపు, ఎంపీ కోమటిరెడ్డి వర్గీయులు ఇంకోవైపు ఎవరికి వారే గ్రామాలు, మండలాలు పర్యటిస్తూ విడివిడిగా రచ్చబండ నిర్వహించారు.
జంగా వర్గీయులు మాత్రమే నైరాశ్యంతో కొందరు కొమ్మూరి, మరికొందరు పొన్నాల వర్గంలో చేరిపోయారు. కాగా, అధికారికంగా నియమితులైన నియోజకవర్గ, బ్లాక్, మండల, గ్రామ, కాంగ్రెస్ కమిటీలకు సమాచారం లేకుండా నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఇటీవల పొన్నాల వర్గీయులు టీ-పీసీసీ క్రమశిక్షణ కమిటీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అగ్రనేతల మధ్య నెలకొన్న విభేదాలతో పార్టీ శ్రేణులు నైరాశ్యంలో పడిపోయారు. జనగామలో ఒకప్పుడు ఒకటిగా ఉన్న పార్టీ ఇప్పుడు మూడుగా చీలడంతో ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా రచ్చబండ పేరుతో ఒకే పార్టీకి చెందిన నాయకులు ఒకరితో ఒకరు సంబంధం లేదన్నట్లుగా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల నియోజకవర్గంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ఎలాంటి చర్యలకు దారి తీస్తాయోనని ముఖ్యనాయకులు, కార్యకర్తలు అయోమయం వ్యక్తం చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ పార్టీలో సఖ్యత లేని కారణంగా చైర్మన్ పదవి చేజారడం సహా మున్సిపల్లో కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ సహా మెజార్టీ కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఏ విధంగా ఉంటుందోనని పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.