ఐనవోలు, ఏప్రిల్ 2 : కట్టుకున్న భార్యను..కన్న కూతుర్లను కంటికి రెప్ప లా చూసుకోవాల్సిన వ్యక్తే వారి పాలిట కాలయముడయ్యాడు. పథకం ప్రకారం వారి ని నమ్మించి కానరాని లోకాలకు పంపించాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేల్ వద్ద బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో స్విమ్మింగ్ పూల్లో శవాలై తేలిన తల్లి, ఇద్దరి కూతుర్లది హత్యేనని గురువారం పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆడ పిల్లలంటే ఇష్టం లేకనే ఇంత దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు. గ్రామస్తు లు, పర్వతగిరి సీఐ రాజగోపాల్ కథనం ప్రకారం.. పున్నేల్కు చెందిన అజారుద్దీన్, ఫర్హత్ (26) దంపతులకు ఉమే రా(8), అయేషా(6) కూతుర్లు. వారు స్విమ్మింగ్ ఫూల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇటీవల భార్య మళ్లీ గర్భం దాల్చగా పుట్టబోయేది కూడా మళ్లీ అడపిల్లే అని నిర్ధారణ చేసుకున్న అజారుద్దీన్ భార్యను అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్య పది రోజుల క్రితం పెంచుకున్న తల్లిగారి ఇంటికి వెళ్లి అక్కడ ఉండగా, రెండు రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చాడు. ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం బుధవారం రాత్రి భార్య, ఇద్దరు పిల్లలకు బిర్యాని, ఐస్క్రీమ్ తినిపించి స్విమ్మింగ్ ఫూల్ వద్దకు తీసుకొచ్చాడు. అప్పటికే అక్కడున్న సీసీ కెమెరాలు, లైట్లను బంద్ చేసి వారిని స్విమ్మింగ్ పూల్లో తోసేసి హత్య చేసినట్లు సీఐ తెలిపారు.
ఘటనా స్థలిని పరిశీలించిన సీపీ
పున్నేల్ క్రాస్ సమీపంలోని ‘సీ’ స్విమ్మింగ్ ఫూల్ను ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్తో కలిసి వరంగల్ సీపీ సన్ప్రీతిసింగ్ పరిశీలించారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన దర్యాప్తు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన విచారణను పూర్తిచేయాలని ఆదేశించారు. ఆయన వెంట సీఐ రాజగోపాల్, ఎస్సై పస్తం శ్రీనివాస్ ఉన్నారు. అనంతరం మామునూరు ఏసీపీ వెంకటేశ్ సమక్షంలో క్లూస్ టీమ్ ఘటనా స్థలం వద్ద ఆధారాలు సేకరించింది.
వారిది ప్రేమ పెళ్లి..
వరంగల్ నగరంలోని కరీమాబాద్కు చెందిన ఎండీ నసీమాబేగం, మహబుబ్అలీ దంపతుల రెండో కుమార్తె ఫర్హత్. పున్నేల్కు చెందిన తన చెల్లె సల్మా, అలీ దంపతులకు పిల్లలు లేకపోవడంతో నసీమాబేగం పర్హత్ను దత్తత ఇచ్చింది. ఈ క్రమంలో అజారుద్దీన్, ఫర్హత్ ప్రేమించుకొని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ముందు నుంచే ఆడపిల్లలంటే ఇష్టంలేని అజారుద్దీన్ తన భార్య అబార్షన్కు ఒప్పుకోకపోవడంతో ఆమెతో పాటు ఇద్దరు కూతుర్లను హత్య చేశాడు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కరీమాబాద్కు తరలించారు.