సుబేదారి, అక్టోబర్ 30 : ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా కోరారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో మాడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు, బందోబస్తు వివరాలను ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సీపీ : కమిషనరేట్ పరిధిలో పకడ్బందీగా మాడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు చేయడానికి డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బందిని అలర్ట్ చేసి, క్షేత్ర స్థాయిలో బాధ్యతలు అప్పగించాం. నగదు, మద్యం పంపిణీకి అడ్డుకట్ట వేయడానికి చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం. వరంగల్, హనుమకొండ, జనగామ కలెక్టర్లతో (జిల్లా ఎన్నికల అదికారులు) ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాం. ఈ మూడు జిల్లాల్లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో, మూడు పాక్షికంగా ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో కలిసి పోలీసు నోడల్ ఆఫీసర్లు(ఏసీపీ స్థాయి) సమన్వయంతో పని చేస్తున్నారు. ‘సి విజిల్’ యాప్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రచార సభలు, సమావేశాల కోసం ‘సువిధ’ యాప్ ద్వారా అనుమతులు ఇస్తున్నాం. ఆర్వో అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తాం.
సీపీ : జనగామ జిల్లా సరిహద్దు పెంబర్తి, మహబుబాబాద్ జిల్లా సరిహద్దు ఖానాపురం, కరీంనగర్ జిల్లా సరిహద్దు పెంచికలపేట, ములుగు జిల్లా సరిహద్దు కటాక్షపూర్తో పాటు కమిషనరేట్ పరిధిలోని మొత్తం 10 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. ఈ నెల 9 నుంచి 29వ తేదీ వరకు 165 మంది నుంచి రూ.4,55,05,812 నగదు, 2,609 లీటర్ల మద్యం (రూ.15.64లక్షలు), రూ.7.36లక్షల విలువైన గుడుంబా, పటిక, 5.990 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నాం. తగిన ఆధారాలు చూపించిన 50 శాతం మందికి జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా నగదు తిరిగి ఇచ్చాం. ఎన్నికల సామగ్రికి సంబంధించి 17 కేసులు నమోదు చేశాం. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ముందస్తుగా 4,038 మంది పాత నేరస్తులను బైండోవర్ చేశాం. నగదు, మద్యం స్వాధీనంలో రాష్ట్రంలో కమిషనరేట్ ఐదో స్థానంలో ఉన్నది.
సీపీ : ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు. 100 డయల్ ద్వారా లేదా 8712685257 వాట్సాప్ నంబర్కు ఫిర్యాదు చేస్తే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తాం. సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేశాం. సోషల్మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేస్తాం. ఈ పోస్టులపై ఆర్వోకు ఫిర్యాదు చేయాలి. ఆర్వో ఆదేశాల మేరకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 2,125 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 6 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక, 35 అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలోని 45 పోలీసు స్టేషన్లలో చాలా వాటిని సందర్శించాను. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశాను. చాలా చోట్ల 6 కేంద్ర పారామిలటరీ బలగాలతో కవాతులు నిర్వహించాం.
సీపీ : కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడం కోసం తగిన భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికల బందోబస్తు కోసం కేంద్రం నుంచి 18 పారా మిలటరీ బలగాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆరు కంపెనీలు వచ్చాయి. కమిషనరేట్, రాష్ట్ర పోలీసు శాఖ నుంచి మరో 2,500 పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరుగడానికి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు సహకరించాలని కోరుతున్నాం.