పరకాల, సెప్టెంబర్ 13 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేసే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకుని పరకాల పట్టణంలో ఈ నెల 16న నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి ర్యాలీ, సమావేశానికి అవసరమయ్యే స్థలాన్ని పట్టణంలోని పశువుల సంత, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, వ్యవసాయ మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ర్యాలీకి, సమావేశ నిర్వహణకు చేపట్టాల్సిన పనులపై అధికారులతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నదని అన్నారు.
ఇందులో భాగంగా మూడు రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 16న పరకాలలో 15 వేల మందితో ర్యాలీ, సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 17న జిల్లా కేంద్రంలో జెండా ఆవిష్కరణ, 18న సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్ స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి సారంగపాణి, తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.