భీమదేవరపల్లి, మార్చి 24: క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్యాధికారిణి రూబీనా అన్నారు. భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామంలో సోమవారం ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులతో కలిసి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న క్షయ వ్యాధిని నిర్మూలించాలని ప్ల కార్డులతో నినాదాలు చేస్తూ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రుబీనా మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండాలన్నారు.
ఈ వ్యాధి సోకిన వారు దగ్గినా, తుమ్మినా గాలి ద్వారా ఇతరులకు వ్యాధి సోకే ప్రమాదం ఉందన్నారు. నిరంతరంగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, అలసట, రాత్రివేళ చెమట వంటివి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు రెహమాన్, రాజశేఖర్, సిబ్బంది వాణి, మోహన్, ఏఎన్ఎం స్వరూప, పీవీ రంగారావు బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ స్వరూప, హారిక, విద్యార్థులు పాల్గొన్నారు.