హనుమకొండ, జనవరి 28 : వాల్తేరు వీరయ్య విజయ విహారం చేశారు. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం రాత్రి వాల్తేరు వీరయ విజయోత్సవ సభను నిర్వహించారు. మెగా ఆభిమానులతో ఓరుగల్లు ఉప్పొంగింది. నగరంలోని దారులన్నీ ఆర్ట్స్ కళాశాల మైదానం వైపు మళ్లాయి. అభిమానులు, చూపరుల కేరింతల మధ్య మైదానం అంతా మార్మోగింది. ఈ సందర్బంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. సుమ చేసిన యాంకరింగ్ ఎంతో ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్ వచ్చినప్పుడు అభిమానుల కేరింతలతో మార్మోగింది. అనుకున్న సంఖ్య కంటే పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులకు చిరంజీవి, రామ్చరణ్ చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. వరంగల్లో స్టూడియో ఏర్పాటు చేయాలని కోరగా స్పందించిన చిరంజీవి, రామ్చరణ్ తప్పకుండా స్టూడియో ఏర్పాటు చేసుందుకు ప్రయత్నం చేస్తామని మంత్రికి హామీ ఇచ్చారు. అనంతరం చిత్ర హీరో చిరంజీవి మాట్లాడుతు ఓరగల్లు ప్రజల ప్రేమ, అభిమానం, ఆప్యాయత మరువలేనిదన్నారు.
ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఓరుగల్లుపై అడుగుపెట్టినప్పుడు చూపిన ప్రేమ అభిమానం ఇంకా ఉందని అన్నారు. వచ్చిన జనసందోహం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఓరుగల్లు ప్రజల్లో స్వచ్ఛత ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు చూపించే ఆదరాభిమానాలు, ప్రేమ, వాత్సల్యంతోనే ఇక్కడ వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా రూ.250కోట్లు రికార్డు బ్రేక్ చేసిందన్నారు. బహుబలి, ఆర్ఆర్ఆర్ను మించి పోయిందని అన్నారు. 1983 ఖైదీ సినిమా తర్వాత 2023 వాల్తేరు వీరయ్య మళ్లీ నన్ను స్టార్ను చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. కష్టపడే వారికి ప్రజలు గుర్తింపు ఇస్తారని ఈ సినిమా రుజువు చేసిందని ఆయన పేర్కొన్నారు. రాంచరణ్కు రంగస్థలం మంచి పేరు తెచ్చిందన్న చిరంజీవి.. ఆర్ఆర్ ఆర్లో రాంచరణ్ విశ్వరూపం చూపించారని, సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబల్ అవార్డు గెలుచుకొని, ఆస్కార్ అవార్డుకు నామినేషన్కు ఎంపికైందన్నారు. అభిమానుల కేరింతలు, కేకలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయని అన్నారు.
వాల్తేరు వీరయ్య పెద్ద విజయం సాధించిందన్నారు. శృతిహాసన్ జన్మదినం సందర్భంగా విజయోత్సవ కార్యక్రమానికి రాలేదన్న చిరంజీవి వేదిక నుంచే అభిమానుల సమక్షంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సభ విజయవంతం అయ్యేందుకు సహకరించిన మంత్రి ఎర్రబెల్లి, ప్రజా ప్రతినిధులు, పోలీస్ యంత్రాంగం, సహకరించిన అభిమానులకు, ఓరుగల్లు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇంట్లో రాత్రి భోజనం చేసి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ దంపతులు, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు, చిత్ర నిర్మాతలు, డైరెక్టర్, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.