హనుమకొండ చౌరస్తా, జూలై 22: నీట్ పేపరు లీకేజీ నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పాశవిక దాడిని ఖండిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో కేయూ ప్రధాన క్యాంటీన్ నుంచి యూనివర్సిటీ పరిపాలన భవనం వరకు నరేంద్ర మోదీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఈ సందర్భంగా మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దేశంలో నీట్ పేపర్తో పాటు యూజిసీ నెట్ వంటి పరీక్షల పేపర్ లీకులు జరిగాయని దానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు.
విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తే వారిపై మోదీ ప్రభుత్వం పాశవికంగా దాడి చేసి తలలు పగిలేలా రక్తం చిందేల లాఠీచార్జి జరిపి విద్యార్థులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు మంద భాస్కర్, బొట్ల మనోహర్, ఎల్తురి సాయికుమార్, కామగోని శ్రవణ్, కుమ్మరి శ్రీనాథ్, మర్రి మహేష్, పెండ్యాల రాకేష్, శివ, విద్యార్థులు నితిన్, విజయ్, సతీష్, రణదీప్, అఖిల, ప్రియాంక, అంకిత పాల్గొన్నారు.