జనగామ : జనగామ పట్టణ కేంద్రంలోని గీతాశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలకు శుక్రవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి వేషధారణలో వచ్చిన చిన్నారులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా ముచ్చటించారు. చిన్నారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి చదువుల గురించి ఆరా తీశారు. చిన్నారులతో సరదాగా మాట్లాడి వారిని ఉత్సాహపరిచారు. శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులను చూసి సంతోషం వ్యక్తం చేస్తూ వారిని ఆశీర్వదించారు.
అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… శ్రీకృష్ణాష్టమి వేడుకలను గీతాశ్రమం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా అత్యంత అద్భుతంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించిన గీతాశ్రమం నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడు అందించిన బోధనలు, భగవద్గీత సందేశాలను చిన్నారులు విని, చదివి, తెలుసు కోవాలని సూచించారు. శ్రీకృష్ణుడు చూపిన సన్మార్గాన్ని జీవితంలో పాటిస్తూ ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.