హనుమకొండ చౌరస్తా, జూలై 30 : విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, వారికి నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించడం, మాదకద్రవ్యాలు, చెడు అలవాట్లు, ఇతర వ్యసనాలకు బానిసలు కాకుండా చైతన్యపరచడమే ‘తరగతి గది – ఏ దేశ భవిష్యత్తు’ కార్యక్రమ లక్ష్యమని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ (HRPWAO) జాతీయ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు గొట్టిముక్కుల మాధవాచారి, జాతీయ కార్యదర్శి మాధవి భైరి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవనీత్ జినుకల, ప్రముఖ ప్రజా కళాకారులు బుల్లెట్ వెంకన్న ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఆటలు, పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రేరణాత్మక సందేశాలు, అవగాహన కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి పాఠశాలకు తీసుకెళ్లి విద్యార్థుల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు సంస్థ కృషి చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రారంభించి, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్తలు, సామాజిక సేవకులు, ప్రజాప్రతినిధులు, కళాకారులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.