హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 26 : మానవ సంక్షేమం, సమగ్రాభివృద్ధి, సుస్థిర ప్రగతే దేశ లక్ష్యాలు కావాలని కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి అన్నారు. కేయూ సెనేట్ హాల్ లో సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ విభాగాల డీన్ ఆచార్య బి.సురేష్లాల్ అధ్యక్షతన రెండురోజుల జాతీయ సదస్సు ‘ఇంటిగ్రేటింగ్ ఎస్ డీజీస్ ఫర్ వికసిత్ భారత్ @ 2047: అచీవ్మెంట్స్ అండ్ పాత్వేస్’ అనే అంశంపై జరిగిన రెండురోజుల జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, సమగ్ర వైద్య సేవలు, వివక్ష నిర్మూలన వంటి అంశాలపై దృష్టి పెట్టడం ద్వారానే ‘వికసిత్ భారత్ @ 2047’ లక్ష్యం సాధ్యమవుతుందని, ఈ దిశగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనేక పథకాలు, సూచనలు అమలు చేస్తున్నాయని తెలిపారు.
2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవాలని, తెలంగాణ రాష్ర్టం “రైజింగ్ తెలంగాణ” దిశగా 2030 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నదని వివరించారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, పర్యావరణ వినాశనానికి మానవ ప్రవర్తనలో మార్పులు అవసరమని, హరిత విప్లవం, నీలి విప్లవం, ఆర్థిక సంస్కరణల ద్వారా దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని గుర్తుచేశారు.
సుస్థిర ఆర్థిక వ్యవస్థ నిర్మాణం తరగతి గది నుంచే ప్రారంభం కావాలని, ఆరోగ్యకరమైన ఆహారం, సేంద్రీయ వ్యవసాయం వైపు ప్రయాణంలో వివేకం అవసరమని సూచించారు. రిజిస్ట్రార్ ప్రొఫసర్ వల్లూరి రాంచంద్రం మాట్లాడుతూ యువత మార్పుకు ఏజెంట్లు కావాలని, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.