సుబేదారి, జూన్ 26 : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో ఆదివారం నిర్వహించిన సైక్లోథాన్ వరంగల్-2022 ఉత్సాహంగా జరిగింది. సైక్లింగ్ పోటీల్లో పాల్గొనడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో యువతీయువకులు హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్కు తరలివచ్చారు. 600 మందికిపైగా ముందుగా 199 రూపాయల చొప్పున చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పోటీల్లో పాల్గొన్నవారందరికీ పోలీస్ కమిషనరేట్ తరఫున సైకిళ్లు ఏర్పాటు చేశారు. హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో 25 కిలోమీటర్లు ఫుల్ రేస్, 15 కిలోమీటర్లు ఫన్ రేస్, 5 కిలోమీటర్లు కిడ్స్ రేస్ విభాగాల సైక్లింగ్ పోటీలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైక్లింగ్ పోటీలు ఆరోగ్యానికి దోహదం చేస్తాయని చెప్పారు. వరంగల్ కమిషనరేట్ పోలీసులు మత్తు పదార్థాల నియంత్రణ, యువత మత్తుకు బానిసకాకుండా ఉండేందుకు సైక్లింగ్ పోటీలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలపై ప్రజలను మరింత చైతన్యం చేయాలని మంత్రి దయాకర్రావు పోలీసులకు సూచించారు. ఇటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత అతి పెద్ద రెండో నగరం వరంగల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. క్రీడా హబ్గా తీర్చిదిద్దడానికి తనవంతు కృషిచేస్తానని చెప్పారు.
సైక్లింగ్తో సంపూర్ణ ఆరోగ్యం : చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
సైక్లింగ్తో సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటామని, మానసికంగా ప్రశాంతత లభిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైక్లింగ్ పోటీలు యువతను మేల్కొలుపుతాయని అన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, సమాజ హితం కోసం పాటుపాటుపడాలని ఆయన సూచించారు. పట్టుదలతో అనుకున్న లక్ష్యసాధన కోసం కఠోర సాధన చేయాలని పిలుపునిచ్చారు.
మూడు కిలోమీటర్లు మంత్రి, చీఫ్ విప్ సైక్లింగ్..
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి సుబేదారి డీఐజీ బంగ్లా వరకు, తిరిగి డీఐజీ బంగ్లా నుంచి పోలీస్ కమిషనరేట్ వరకు ప్రధాన రహదారిపై సైకిల్ తొక్కి ఆకట్టుకున్నారు. సైకిల్ తొక్కుతూ పోటీల్లో పాల్గొన్న యువతను ఉత్సాహపరిచారు.
సైకిల్తో రాహుల్ మిశ్రా విన్యాసాలు..
సైక్లింగ్ అంతర్జాతీయ క్రీడాకారులు నైనాజైశ్వాల్, రాహుల్మిశ్రా, బాలీవుడ్ నటుడు నకుల్ రోషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, పోలీస్ కమిషనర్ తరుణ్జోషితో రాహుల్ మిశ్రా సైకిల్ తొక్కాడు. అక్కడక్కడ సైకిల్ను గాల్లో లేపుతూ విన్యాసాలు చేశాడు. ఈసందర్భంగా టేబల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ వరంగల్తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక్కడికి చాల సార్లు వచ్చాను, చారిత్రక నగరంగా వరంగల్ ఎంతో పేరుగాంచింది, ఇక్కడి నుంచి అనేక మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారని కొనియాడారు.
విజేతలు వీరే..
5 కిలోమీటర్ల సైక్లింగ్ పోటీల్లో బిందియా మొదటిస్థానంలో నిలిచారు. 15 కిలోమీటర్ల రేస్లో శ్రుతిక్, 25 కిలోమీర్ల రేస్లో రాకేశ్ మొదటిస్థానంలో నిలిచి నగదు బహుమతి సొంతం చేసుకున్నారు. విజేతలకు పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి నగదు పురస్కారాలు ప్రదానం చేశారు. సైక్లింగ్ పోటీల్లో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ గోపి, డీసీపీలు అశోక్కుమార్, వెంకటలక్ష్మి, అదనపు డీసీపీ ,ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది, యువతీయువకులు పాల్గొన్నారు.
25 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య 25 కిలోమీటర్లు సైకిల్ తొక్కారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి మడికొండ -రాంపూర్ 12.5 కిలోమీటర్లు, తిరిగి పోలీస్ కమిషనరేట్ వరకు సైకిల్ తొక్కి పోటీల్లో పాల్గొన్న యువతకు ఆదర్శంగా నిలిచారు.
హైదరాబాద్ నుంచి కిరాయికి సైకిళ్లు..
హనుమకొండ పోలీసు కమిషనరేట్ నుంచి అంబేద్కర్ జంక్షన్, నక్కలగుట్ట, అదాలత్, కలెక్టరేట్, కాజీపేట, మడికొండ ప్రధాన రహదారి వరకు వందల సైకిళ్లతో యువత పోటీ పడ్డారు. దీంతో నగరంలో సందడి నెలకొంది. సైక్లింగ్ పోటీల కోసం వరంగల్ కమిషనరేట్ పోలీసు అధికారులు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి సైకిళ్లను కిరాయికి తీసుకొచ్చారు.