శాయంపేట, మే 21 : మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, 14 మందిపై కేసు నమోదుచేశారు. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం..శనివారం శాయంపేట పోలీసు సిబ్బంది పత్తిపాక గ్రామ శివారులో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఐదు వాహనాల్లో తీసుకొచ్చిన పీడీఎస్ బియ్యాన్ని లారీలో ఎక్కించి తరలించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు 175 క్వింటాళ్ల బియ్యంను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. మండల సంతోష్, తకళ్లపల్లి చిరంజీవి, పుచ్చ రజినీకాంత్, డ్యాగల చందు, రాధారపు ప్రశాంత్, గొడిశాల మురళి, చిలకల రంజిత్కుమార్, గోనెల సంతోషం, విజయ్, రాజకుమార్, వెంకటేశ్, కలాలి కృష్ణంరాజు వాహనాల్లో పీడీఎస్ బియ్యాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. గుజరాత్ కి చెందిన మోరి లక్మాన్, కోడియతర్ మిర్మన్ నాజబాయ్ లారీలో బియ్యాన్ని నింపి తరలిస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. ఈమేరకు 14 మందిపై కేసు నమోదు చేసి, 4 ట్రాలీ వాహనాలను, 1 బొలెరో వాహనం, ఒక లారీ, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న బియ్యం విలువ రూ.1.75 లక్షలు ఉంటుందని ఎస్సై వివరించారు. .
శాయంపేటలో 34 క్వింటాళ్లు
శాయంపేట మండల కేంద్రంలోని రేషన్ దుకాణం నుంచి అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన 34 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని డీలర్తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరభద్రరావు శనివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం..శాయంపేటలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మారెపల్లి అనూష రేషన్ దుకాణంలో బియ్యాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం వచ్చిందని పేర్కొన్నారు. ఈమేరకు అక్కడి వెళ్లి తనిఖీ చేయగా డీలర్ అనూషతోపాటు అక్కడ ఉన్న పత్తిపాకకు చెందిన మేకల సునీల్ను విచారించినట్లు చెప్పారు. 34 క్వింటాళ్ల బియ్యాన్ని మేకల సునీల్.. కరీమాబాద్కు చెందిన మండల సంతోష్కు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తేలిందని వివరించారు. ఈ మేరకు డీలర్తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పట్టుకున్న రేషన్ బియ్యం విలువ రూ.34వేలు ఉంటుందని ఎస్సై తెలిపారు. కాగా, మండలంలో ఒకే రోజు రెండు చోట్ల భారీగా రేషన్ బియ్యం పట్టుబడడం చర్చనీయాంశమైంది.