హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 27 : రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు కోరారు. తక్కువ వడ్డీకి రుణాలు పొందుతారని, దీనిపై వడ్డీరేటు రెండు శాతం వరకు ఉంటుందని కలెక్టర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డుల గురించి నాబర్డ్, బ్యాంకర్లు, పశుసంవర్థక శాఖ, అగ్రికల్చర్, ఫిషరీస్ శాఖల అధికారులు, కొన్ని సహకార సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ కార్యాలయ మినీ కాన్ఫరెన్స్ మందిరంలో బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు రుణాలు మంజూరవుతాయని, ఇది ఎంతో ఊరటనిస్తుందన్నారు. అలాగే రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలో పొదుపు చేస్తే అధిక వడ్డీ రేటు లభిస్తుందని, భూమి ఉండి 18 నుంచి 70 ఏళ్లలోపు వయస్సు ఉన్న రైతులందరూ ఏదైనా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకును సంప్రదించి కార్డు పొందవచ్చన్నారు. పాడిరైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులు కూడా కిసాన్ క్రెడిట్ ద్వారా రుణం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అందుకోసం దరఖాస్తుదారుడు వ్యవసాయ భూమిని కలిగి ఉండడం తప్పనిసరికాదని, పశుసంవర్థక లేదా మత్స్య సంపద కోసం ఎవరైనా సులభంగా రూ.1.60 లక్షల వరకు రుణం పొందవచ్చన్నారు.
ప్రభుత్వం నుంచి వచ్చే రుణం కోసం క్రెడిట్ కార్డులను జారీ చేస్తుందని, వారికి సలహాలు, సూచనలు అందించి, అర్హత ఉన్న వారికి తప్పకుండా ఈ క్రెడిట్కార్డును అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే బ్యాంకు మేనేజర్లు నివృత్తి చేసే బాధ్యత తీసుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, పశువైద్య, పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి కేవీ నారాయణ, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు దామోదర్రెడ్డి, ఫిషరీస్ సహాయ సంచాలకులు విజయభారతి, గొర్రెల కాపరుల సహకార సంఘం అధ్యక్షుడు బొజ్జ రవీందర్, దూడయ్య, వివిధ మండలాల పశువైద్యాధికారులు, నాబార్డ్ ఎల్డీఎం, ఇతర బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.