వరంగల్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్ ప్లీనరీలో వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర వంటి అంశాలపై చర్చ జరిగిన ప్లీనరీలో జిల్లా నేతలు కీలకంగా వ్యవహరించారు. పలు తీర్మానాలను స్వయంగా ప్రవేశపెట్టడంతో పాటు మరికొన్ని తీర్మానాలను బలపరుస్తూ ప్రసంగించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులోనూ బిల్లును ఆమోదింపజేసి, అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీర్మానం ప్రవేశపెట్టారు. భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తీర్మానం ప్రవేశపెట్టారు. బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, బీసీ వర్గాల జనగణన చేపట్టాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సరికొండ మధుసూదనాచారి తీర్మానం ప్రవేశపెట్టారు.
నదీజలాల వివాద చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన వాటాను నిర్ణయించాలని, ఈ మేరకు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీర్మానం ప్రవేశపెట్టారు. ఆకాశాన్నంటేలా ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన ప్లీనరీలో వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలకు ప్రాధాన్యం దక్కడంపై పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్యాదవ్, టీఆర్ఎస్ నాయకుడు కేశవరావు తదితరులు పాల్గొన్నారు.