నయీంనగర్, మే 21 : స్థానిక ప్రజల చిరకాల కోరిక త్వరలో నెరవేరబోతున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 56వ డివిజన్లోని సప్తగిరికాలనీ వడ్డేపల్లి చర్చి నుంచి ఉనికిచర్ల వెళ్లే రోడ్డులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ముఖ్యమంత్రి హామీ నిధులు రూ.6.80కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులకు మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి శనివారం ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గ్రేటర్ పరిధిలో 42 గ్రామాలను విలీనం చేసిన సమైక్య పాలకులు ఆ గ్రామాల అభివృద్ధికి తట్టెడు మట్టి కుడా పోయలేదన్నారు. నేడు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ప్రజల సౌకర్యార్థం అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపడమే లక్ష్యమన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సిరంగి సునీల్కుమార్, టీఆర్ఎస్ 56వ డివిజన్ అధ్యక్షుడు రుద్రోజు మణింద్రనాథ్, 55వ డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్, నాయకులు రాజునాయక్, చింత రమేశ్, కల్యాణ్నాయక్, అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముందే చెప్పిన ‘నమస్తే తెలంగాణ’
గత ఏడాది అక్టోబర్ 14న వడ్డేపల్లి ఫిల్టర్బెడ్ రోడ్డు వంతెనను విస్తరించాలని ‘నమస్తే తెలంగాణ’లో కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అనాడు వెంటనే స్పందించిన అధికారులు ప్రమాదాలు జరుగకుండా సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టడంతో పలువురు వాహనదారులు, కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.
విద్యార్థికి అభినందనలు
మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి, ఐనవోలు మండలం కొండపర్తికి చెందిన గద్దల నాగరాజు కుమారుడు గద్దల దివన్ కుమార్ మహారాష్ట్ర పుణెలోని అంతర్జాతీయ ప్రసిద్ధిపొందిన ఫ్లేమ్ యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో సీటు సాధించాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేశ్ హనుమకొండలోని ఆయన నివాసంలో విద్యార్థిని శాలువాతో సతరించారు. కార్యక్రమంలో ఐనవోలు వైస్ ఎంపీపీ తంపుల మోహన్, పార్టీ మండల అధ్యక్షుడు పోలేపల్లి శంకర్రెడ్డి, ప్రధానకార్యదర్శి బుర్ర రాజశేఖర్, దర్గా సొసైటీ వైస్చైర్మన్ మాదాసు బాబు, సర్పంచ్ రాజమణి బెన్సన్ పాల్గొన్నారు.
ప్రమాద బీమా చెక్కు అందజేత
ఐనవోలు : మండలంలోని లింగమోరిగూడేనికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త లింగం లక్ష్మారెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించగా బాధి త కుటుంబానికి మంజూరైన రూ.2లక్షల పార్టీ బీమా చెక్కును శనివారం మృతుడి భార్య లింగం రజితకు ఎమ్మె ల్యే అరూరి రమేశ్ అందజేశారు. బాధితుల ఇంటికి స్వయంగా వెళ్లి చెక్కు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు.
కుట్టుమిషన్ల పంపిణీ
మడికొండ : మడికొండలోని మహి ళా ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యం లో శిక్షణ పొందిన మహిళలకు ఎమ్మెల్యే అరూరి రమేశ్ కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. అంచూరి విజయ్కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ శరత్ బాబు, కార్పొరేటర్లు మునిగాల సరోజన, ఇండ్ల నాగేశ్వర్రావు, రోటరీ క్లబ్ కార్యదర్శి శారు ప్రభాకర్రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సందసాని నరేశ్, అసిస్టెంట్ గవర్నర్ మామిడాల సుధాకర్, గంగోజుల నరేశ్, మాదాల సతీశ్, రాజిరెడ్డి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.