బచ్చన్నపేట మార్చి 9 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలోని
పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, బోధన విధానాలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి బోధనలో నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. అలాగే పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం విషయంలో పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అదే గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకొని, ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. అనంతరం అదే గ్రామ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో డీపీఓ వసంత, హౌసింగ్ పీడీ మాతృ నాయక్, డీఎల్పీఓ వెంకట్ రెడ్డి, ఎంపిడిఓ మమత, ఎంపీఓ శ్రీనాథ్ రెడ్డి, సర్పంచులు అల్వాల నర్సింగరావు, బేదాడి సిద్ధులు పంచాయతీ కార్యదర్శి అనిల్ రాజ్, సౌజన్య, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు..