బచ్చన్నపేట ఏప్రిల్ 30 : జిల్లాలో ఏర్పాటు చేసిన 234 ధాన్యం కేంద్రాలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగాలని, ఇందుకు వ్యవసాయ, సివిల్ సప్లై తదితర శాఖల అధికారులు సమన్వయముగా పని చేయాలనీ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..కొనుగోలు అయిన ధాన్యం సెంటర్ లో ఉండకూడదన్నారు. ఏ రోజూ కారోజు ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కాంటకి ఒక బ్యాచ్, లోడ్ చేసేందుకు ఒక బ్యాచ్ సిబ్బంది ని పెట్టుకొని వెంట వెంటనే ధాన్యం కొనుగోలు, రవాణా అయ్యేలా చూడాలన్నారు.
ప్రతి సెంటర్ కి రవాణా కోసం వెహికిల్ని కేటాయించామని, లోడింగ్, అన్లోడింగ్ ఆలస్యం జరగకూడదన్నారు. గొనె సంచులు కూడా సరిపడా ఉన్నాయని.. కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగడంలో నిర్వాహకులు బాధ్యతయుతంగా వ్యవహరించాలన్నారు. ధాన్యం కొనుగోలు, రవాణాకి సంబంధించి ఏ సమస్య అయిన తమ దృష్టికి వెంటనే తీసుకు రావాలన్నారు. వేసవి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని కేంద్ర నిర్వాహకులు వడ దెబ్బ తగలకుండా జాగ్రత్త లు తీసుకోవాలన్నారు. అలాగే రైతులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు బచ్చన్నపేట మండలం చిన్నరామెంచర్ల గ్రామం పరిధి బచ్చన్నపేట లో ఉన్న HP పెట్రోల్ బంక్ ని కూడా కలెక్టర్ ఆకస్మికం గా సందర్శించి పెట్రోల్, డీజిల్ నిల్వలను పరిశీలించారు.