పోచమ్మమైదాన్/కాశీబుగ్గ/వరంగల్ చౌరస్తా, నవంబర్ 18: కార్తీక పౌర్ణమి సందర్భంగా వరంగల్ ములుగురోడ్డులోని హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న శ్రీరమా సత్యనారాయణస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా జరిపే సత్యనారాయణస్వామి వ్రతాల్లో 350 జంటలు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. శ్రీవాసవీమాత ఆలయంలో వ్రతాలు చేయనున్నట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అంచూరి శ్రీనివాస్ తెలిపారు. కాశీబుగ్గ ప్రాంతంలోని శ్రీకాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి ఆలయాన్ని ముస్తాబు చేశారు. లక్ష వత్తుల నిర్వహణ, ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, పూజలు చేయనున్నారు. గురువారం వరంగల్ స్టేషన్ రోడ్లోని శ్రీకాశీవిశ్వేశ్వరాలయంలో జ్వాలాతోరణ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు లంకా శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో ఆలయ ట్రస్టీ ఆకారపు హరీశ్, స్వాతి దంపతులు పాల్గొన్నారు.
భద్రేశ్వరస్వామి ఆలయంలో..
వరంగల్: భద్రకాళీ గుట్టపై ఉన్న భద్రేశ్వరస్వామి ఆలయంలో శైవాగమ ప్రవర్తకుడు ముదిగొండ ధీరజారాధ్యులు నేతృత్వంలో వైభవోపేతంగా జ్వాలాతోరణత్సోవం నిర్వహించారు. ఆలయంలో వందలాది మంది భక్తులకు జ్వాలాతోరణోత్సవ దర్శనం కలిగింది. నగరంలోని పంచభూత లింగక్షేత్రాలలో భద్రమ్మగుట్ట భద్రకాళీ ఆలయంలోని భద్రేశ్వరస్వామి తేజో లింగం(అగ్నిగుండం)గా వెలుగొందుతున్నదని ధీరజారాద్యులు అన్నారు. వరంగల్కోటలోని స్వయంభూ లింగేశ్వరస్వామి పృథ్వీలింగం, మట్టెవాడలోని భోగేశ్వరస్వామి ఆలయంలో జలలింగం, హనుమకొండలోని సిద్ధేశ్వరస్వామి వాయులింగం, మెట్టుగుట్టలోని రామలింగేశ్వరామి ఆకాశలింగంగా ప్రసిద్ధి చెందినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శేషుభారతి పాల్గొన్నారు.