రంగల్, మార్చి 13 : నేటి ఆధునిక కాలంలో మోటర్ సైకిల్ ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారింది. ఒకప్పుడు బైక్ ఇంట్లో ఉంటే గొప్ప అనేవారు. ఇప్పుడు మనిషికి ఒక బైక్ అనేది కామన్. కొందరికి రెండు కూడా ఉంటున్నాయి. అదనంగా కారు కూడా ఉండాల్సిందే. అదే ఇప్పుడు స్టేటస్ సింబల్గా మారింది. అలాగే ప్రజారవాణాలో ఆటోలు కీలకంగా మారాయి.
ఇలా కాలానుగుణంగా వస్తున్న మార్పులతో జీవన విధానమూ మారుతుండడంతో వాహనాలు వినియోగం పెరిగింది. మార్కెట్లోకి వచ్చే కొంగొత్త మోడళ్లపైనా యువత ఆసక్తి చూపుతూ రయ్య్మ్రంటూ దూసుకుపోతున్నారు. సులభంగా రుణం ఇచ్చేందుకు ఫైనాన్స్ సంస్థలు కూడా ముందుకొస్తుండడంతో నిశ్చింతగా కొంటున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ వాహనాలు కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి.
ప్రసుత్తం ద్విచక్ర వాహనాల సంఖ్యను చూస్తూ ఇళ్ల కంటే ఎక్కువగానే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో వాహనాల సంఖ్య భారీగా పెరిగినట్లు రవాణా శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వ్యక్తిగత రవాణాకు అలవాటు పడడంతో సొంత వాహనాల కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు. కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారు.
ఫైనాన్స్ సంస్థలు వాహన కొనుగోళ్లకు రుణాలు సులభంగా ఇస్తుండడంతో కొనుగోళ్లు రెట్టింపు అయ్యాయి. ఈఎంఐ పద్ధతితో సులువుగా రుణం చెల్లిస్తున్నారు. దీంతో ఆటోమొబైల్ మార్కెట్కు మంచి ఊపు వచ్చింది. మార్కెట్కు అనుగుణంగా ఆరునెలలకు ఒక కొత్త మోడల్ను విడుదల చేస్తున్నారు. దీనికి తోడు వ్యవసాయ రంగంలో ట్రాక్టర్ల వినియోగం పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం త్రీ వీలర్స్ వాహనాలు వినియోగిస్తున్నారు.
పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా రహదారుల విస్తరణ జరుగుతోంది. భవిష్యత్ అంచనాలకు తగ్గట్టుగా రోడ్లను విస్తరిస్తున్నారు. కొత్త మాస్టర్ప్లాన్లో ప్రధాన రహదారులు 150 ఫీట్లుగా సూచించారు. ప్రతి అంతర్గత రహదారులు 30 ఫీట్లుగా పేర్కొన్నారు.
జిల్లా, మండల కేంద్రాలలో ప్రధాన రహదారులన్నీ విశాలంగా రూపుదిద్దుకుంటున్నాయి. గ్రేటర్ పరిధిలో అన్ని రహదారులు వెడల్పు చేసే యోచనలో అధికార యంత్రాగం ఉంది. దీనికి తోడు నగరం చుట్టూ ఇన్నర్, ఔటర్, రీజినల్ రింగ్రోడ్లు వస్తున్నాయి. ప్రతి కొత్త రహదారి నిర్మాణం భవిష్యత్లో వాహనాల రద్దీని అంచనా వేస్తూ నిర్మాణాల ప్రణాళికలు చేస్తున్నారు.