వయ్యారిభామ. ఇది అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. సాగుభూమిలోనే కాకుండా ఖాళీ స్థలాల్లో ఎక్కడచూసినా కనిపించే ఈ మొక్క ఇటు పంటలే కాదు, అటు పాడి పశువులు, మనుషుల ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నది. దున్నినా, పీకేసినా నశించకుండా వేల ఎకరాలకు వేగంగా విస్తరిస్తుండడంతో నత్రజని స్థిరీకరణ తగ్గి పంటల దిగుబడి క్రమేపీ క్షీనిస్తున్నది. దీన్ని నివారించేందుకు రసాయనాలు చల్లాలంటే ఎకరానికి రూ.3వేలు ఖర్చుచేయాల్సి రావడం చిన్న, సన్నకారు రైతులకు కష్టమవుతున్నది. అయితే పూతకు రాని దశలోనే ఈ మొకలను నిర్మూలించడమే శాశ్వత పరిష్కారమని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
వయ్యారిభామ మొక 1975లో మనదేశంలో మొదటిసారి మొలిచింది. ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్న మన దేశం అమెరికా నుంచి మేలు రకమైన గోధుమ విత్తనాలను దిగుమతి చేస్తున్నది. అమెరికా కంపెనీలు అక్కడినుంచి గోధుమ విత్తనాలను పంపేటప్పుడు ఉద్దేశపూర్వకంగానే వయ్యారిభామ విత్తనాలను కలిపి పంపించారు. అప్పడున్న పరిస్థితుల్లో మన దేశంలో నాణ్యతాపరమైన నియంత్రణ చర్యలు అందుబాటులో లేవు. మన దేశానికి వచ్చిన వయ్యారిభామ విత్తనాలు గోధుమలతో పాటు విస్తారంగా సాగయ్యాయి. కొద్ది కాలంలోనే ఈ మొక్క విపరీతంగా విస్తరించింది. ఒక వయ్యారిభామ మొక 30వేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. మొక ఉన్న చోటు నుంచి గాలితో కిలోమీటర్ల దూరంలోని కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తాయి. వరి మినహా అన్ని పంటల మధ్యలోనూ పెరుగుతుంది. వయ్యారిభామ మొకలు వేగంగా పెరుగుతాయి. పూతకు రాని దశలోనే ఈ మొకలను నిర్మూలిస్తేనే దీన్ని శాశ్వతంగా లేకుండా చేయవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వరంగల్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వయ్యారిభామ(పార్తీనియం హిస్టిరోఫోరస్) ప్రమాదకర కలుపు మొక రైతులను ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా దెబ్బతీస్తున్నది. ఎక్కడ ఖాళీ జాగ ఉన్నా ఈ మొక్క ఉంటున్నది. దున్నినా, పీకి పారేసినా ఈ మొక్క నశించడం లేదు. సాగు భూముల మధ్యలో ఉండే గెట్లపైనా ఎక్కువగా మొలుస్తున్నది. ప్రతి సాగుభూమిలోనూ ఈ మొక్కలు ఉంటున్నాయి. పడావు భూముల్లో తీవ్రంగా ఉంటున్నది. వయ్యారిభామ కలుపు మొక్కను వ్యవహారికంగా కాంగ్రెస్ గ్రాస్ అని పిలుస్తారు. ఈ కలుపుమొక రోజురోజుకూ కొత్త భూముల్లోనూ విపరీతంగా విస్తరిస్తున్నది. కొద్దిపాటి పదను ఉన్నా ఈ మొక్క బాగా పెరుగుతుంది. దీన్ని నివారించి పంటలను కాపాడుకునేందుకు రసాయన మందుల కోసం ఎకరానికి రూ.3వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఖర్చు చేయలేని చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వయ్యారిభామ ఉన్న భూమల్లో నత్రజని స్థిరీకరణ తగ్గి పంటల దిగుబడి క్రమంగా తగ్గిపోతుంది. వయ్యారిభామ మొక్క మనుషుల ఆరోగ్యంపై, పంటలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. మనుషులకు ఊపిరితిత్తులు, చర్మవ్యాధులు సోకుతాయి. ఇండ్ల పెరడు, ఆటస్థలాల్లో ఈ మొకలు విపరీతంగా ఉండడంతో చిన్నపిల్లలు సైతం ఈ వ్యాధుల బారినపడుతున్నారు. వయ్యారిభామ మొక మనుషులకు, జంతువులకు అత్యంత ప్రమాదకారి అని ఈ విత్తనాలు మన దేశానికి వచ్చిన కొద్దిరోజులకే శాస్త్రవేత్తలు గుర్తించారు. వయ్యారిభామ వల్ల మనుషులకు కళ్ల మంట, విషజ్వరం, చర్మ, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని తెలిపారు. పాడి పశువులు ఈ మొకను తింటే పాల ఉత్పత్తి తగ్గిపోతుంది.
వయ్యారిభామ అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక. మొక్కల పువ్వులోని పరాగ రేణువులు గాలి ద్వారా మనుషుల ముక్కుల నుంచి ఊపిరితిత్తులకు చేరుతాయి. ఈ మొక్కతో పంటలకు చాలా తెగుళ్లు వస్తాయి. ఒక మొక్క నుంచి ఒకేసారి లక్షల సంఖ్యలో విత్తనాలు వస్తాయి. గాలితోనే కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఈ మొక్కను నేరుగా చేతితో ముట్టుకోవద్దు. ఇప్పటికే ఇది అదుపు చేయలేనంతగా విస్తరించింది. కొందరు, కొన్నిచోట్ల నిర్మూలిస్తే ఫలితం ఉండదు. ఒకేసారి క్రమపద్ధతిలో నిర్మూలిస్తే ఈ మొక్కలు శాశ్వతంగా అంతరించిపోతాయి. చాలామంది రైతులు జనవరి తర్వాత వయ్యారిభామ మొక్కలను పీకి మంటపెడతారు. దీని వల్ల ప్రయోజనం ఉండదు. పీకి పక్కన వేసినా అక్కడ విత్తనాలు పోగవుతాయి. పూతకు రాక ముందు మొకలను పీకి కాల్చి వేయాలి.