గోవిందరావుపేట/వెంకటాపూర్, సెప్టెంబర్ 26 : ఉమ్మడి వరంగల్తో పాటు అటవీ జిల్లా ములుగు పర్యాటకపరంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాలతో పాటు విదేశీ పర్యాటకుల సందడి పెరుగుతోంది. రామప్ప, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర, మల్లూరు హేమాచల క్షేత్రం, బొగత వాటర్ ఫాల్స్, లక్నవరం సరస్సు అందాలు టూరిస్టులను కట్టిపడేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతూ పర్యాటకులను సకల సౌకర్యాలను కల్పిస్తున్నది. టూరిజంపై అవగాహన కల్పించడం కోసం యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజన్స్ ఆధ్వర్యంలో 1980 నుంచి ప్రత్యేక థీమ్తో ఏటా సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. సామాజిక, సాంస్కృతిక ఆర్థిక విలువలను పెంపెందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా దినోత్సవం జరుపుతున్నారు.
యునెస్కో గుర్తింపుతో పెరిగిన పర్యాటకం
రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించిన తర్వాత పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. కరోనాతో డీలా పడిన పర్యాటక రంగం యునెస్కో గుర్తింపుతో ఉమ్మడి వరంగల్లోని ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పర్యాటక ప్రదేశాల సందర్శనకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది.
ఉమ్మడి జిల్లాలో అనేక ప్రదేశాలు
ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కాకతీయ చరిత్ర, వైభవాన్ని చాటే వరంగల్ కోట, వేయిస్తంభాల గుడి, రామప్ప గుడి, కోటగుళ్లు, వరంగల్ కోట, వేయిస్తంభాల గుడి, భద్రకాళి గుడి, రామప్ప గుడి, మల్లూరు, ఐనవోలు, కోటగుళ్లతో పాటు లక్నవరం, రామప్ప, పాకాల, గణపురం సరస్సులు, బొగత, కొంగాల, వీఫాల్స్ లాంటి జలపాతాలు కట్టిపడేస్తున్నాయి. అలాగే ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం, ఏటూరునాగరం అభాయరణ్యం, తాడ్వాయి, జానంపేటలోని రాక్షస సమాధులు, పాండవుల గుట్టలోని పెయింటింగ్స్, మరో అంకోర్వాట్గా పిలువబడే దేవునిగుట్ట లాంటి అనేక రకాల పర్యాటక ప్రదేశాలు, గోదావరి పరివాహక ప్రాంతాలు గల వరంగల్కు ఏటేటా పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అద్భుతమైన, అందమైన, చారిత్రక ప్రదేశాలున్న వరంగల్ స్వదేశీ పర్యాటకులతో విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటున్నది.
అందుబాటులో సకల సౌకర్యాలు
ఉమ్మడి వరంగల్లో బస చేయడానికి హనుమకొండలోని హరిత, లక్నవరం, రామప్ప, తాడ్వాయి, గట్టమ్మ తదితరుల ప్రదేశాల్లో అత్యాధునిక వసతులతో టూరిజం హోటళ్లతో పాటు అనేక ప్రైవేట్ హోటల్స్ సౌకర్యాలు కల్పిస్తున్నాయి. లక్నవరం, రామప్ప, పాకాల లాంటి ప్రదేశాల్లో టూరిజం కార్పొరేషన్ బోటింగ్, పాండవుల గుట్టలో ట్రెక్కింగ్, లక్నవరంలో నైట్ క్యాంపెయినింగ్ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
పర్యాటకంలో ములుగు జిల్లా ముందంజ
రాష్ట్రంలోనే ములుగు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలో ఏకైక పర్యాటక జిల్లా ములుగు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు మరిచిపోలేని అనుభూతిని పొందుతారు. పర్యాటకానికి పెట్టింది పేరుతో ములుగు జిల్లా స్వరాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాలు, దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షిస్తూ తన వద్దకు వచ్చేలా చేస్తుంది.