హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 15: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జేఎన్ఎస్లో తెలంగాణ 9వ ఫెడరేషన్ కప్ అండర్-20 జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల ఈ పోటీల్లో రాష్ట్రంలోని 33జిల్లాల నుంచి సుమారు 350 మంది అథ్లెట్లకు మొత్తం 40 ఈవెంట్లు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి తెలిపారు. తొలిరోజు జరిగిన వివిధ ఈవెంట్లలో అథ్లెట్లు నువ్వానేనా అన్నట్లు పోటీ పడ్డారు. బంగారు పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన క్రీడాకారులు ప్రతిభ చాటారు. డీసీపీ కర్ణాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీలను లాంఛనంగా ప్రారంభించిన మాట్లాడారు. ఆటలు ఆరోగ్యానికి చాలా మంచివన్నారు. ప్రతివిద్యార్థికి చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న అథ్లెట్లు ప్రతిభచాటి నేషనల్స్కు ఎంపికై పేరుప్రఖ్యాతలను తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్ఎస్ఆర్ అధినేత ఎన్.సంపత్రావు మాట్లాడుతూ వరంగల్ ఘనకీర్తిని ప్రపంచానికి చాటాలని క్రీడాకారులకు సూచించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, షైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారని, వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులు ఈనెల 28 నుంచి 30 వరకు తమిళనాడులోని తిరువన్నామలైలో జరిగే నేషనల్స్ పాల్గొంటారని అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ సారంగపాణి తెలిపారు. వరంగల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ యుగేందర్రెడ్డి, ములుగు సెక్రటరీ పగడాల వెంకటేశ్వర్రెడ్డి, రామప్ప అకాడమి చైర్మన్ ఐలి చంద్రమోహన్గౌడ్, జాయింట్ సెక్రటరీ మనోజ్, సెక్రటరీ సాయిలు, కోచ్ గౌస్ పాల్గొన్నారు.
జేఎన్ఎస్లో నిర్వహించిన 400 మీటర్ల పరుగుపందెంలో హనుమకొండకు చెందిన బీ కార్తీక్ బంగారు పతకం సాధించారు. లాంగ్జంప్లో పీ పరశురాం సిల్వర్, హామర్ త్రోలో వరంగల్కు చెందిన బీ నగేశ్, డిస్కస్ త్రోలో ములుగు జిల్లాకు చెందిన ఏ మధుకర్ సిల్వర్, సీహెచ్ దినేష్, బీ నరేంద్ర బ్రాంజ్ మెడల్స్ సాధించారు. షేక్లాల్పాషా 100 మీటర్లలో, ఆకుముడుపుల మైథిలి 400 మీటర్లలో గోల్డ్ కొట్టారు. మొదటి రోజు జరిగిన పోటీల్లో ఖమ్మం జిల్లాకు చెందిన అథ్లెట్లు రెండు బంగారు, 3 బ్రాంజ్ మెడల్స్ సాధించి ముందంజలో ఉన్నారు. గెలుపొందిన వారికి శనివారం సాయంత్రం తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి, కోశాధికారి డాక్టర్ రాజేశ్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పీ వెంకటేశ్వర్రెడ్డి మెడల్స్ అందజేశారు.