వరంగల్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. తొలిసారిగా ఇద్దరు మహిళలు ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులయ్యారు. ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ(సీతక్క), వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భాగంగా ఉన్న మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్బాబు, హనుమకొండ జిల్లాలో భాగంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నం ప్రభాకర్కు మంత్రిగా అవకాశం దక్కింది. కాగా ఎవరికి ఏ శాఖలు కేటాయించాలన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల పరిధితో కలిపి మొత్తంగా నలుగురు మంత్రులు ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా అవకాశం దక్కింది. ములుగు ఎమ్మెల్యే సీతక, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లో భాగంగా ఉన్న మంథని, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ మంత్రులగా నియమితులయ్యారు. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాకు నలుగురు మంత్రులు ప్రతినిధ్యం వహించనున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో గురువారం సాయంత్రం వీరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినా సీఎం రేవంత్రెడ్డి వీరికి ఇంకా శాఖలను కేటాయించారు. కొండా సురేఖ గతంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 2009 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండా సురేఖ తొలిసారి మంత్రి అయ్యారు. ఇప్పుడు రెండోసారి ఇదే శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తారని ప్రచారం జరిగింది. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉండడం అనవాయితీగా వస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఈ పరంపరం కొనసాగుతున్నది. తొలిసారిగా ఇద్దరు మహిళలకు ఈ అవకాశం దక్కింది. కాగా వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క, కొండా సురేఖలకు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్ఎస్యూఐ నుంచి ఎదిగిన పొన్నం
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐలో పని చేసిన పొన్నం ప్రభాకర్ 2004లో కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2009లో కరీంనగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో ఇదే స్థానంలో ఓటమిపాలయ్యారు. 2018లో కరీంనగర్ ఎమ్మెల్యేగా, 2019లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తాజా ఎన్నికల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అంచెలంచెలుగా ఎదిగిన సీతక్క
ములుగు, డిసెంబర్ 7 (నమస్తేతెలంగాణ) : ములుగు మండలం జగ్గన్నపేటలో పుట్టిన ధనసరి అనూయ (సీతక్క), 1988లో పదో చదువుతున్న కాలంలో పూలందేవి రచనలకు ప్రేరేపితమై విప్లవోద్యం వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలో సీపీఐ(ఎంఎల్) జనశక్తిలో చేరి ఆదివాసీల తరఫున పోరాటం చేశారు. నక్సల్ నాయకుడు కుంజ రామును వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు సూర్య కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి దళం లీడర్గా సీతక్క ప్రధాన భూమిక పోషించారు. సుమారు రెండు దశాబ్దాల పోరుబాటను 1997లో వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. 2001లో హైదరాబాద్లో న్యాయవిద్య చదివారు. ఈ క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సీతక్కకు 2004లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. తొలిసారి ఎన్నికల్లో సమీప అభ్యర్థి పోదెం వీరయ్య(కాంగ్రెస్) చేతిలో సీతక్క ఓటమి పాలయ్యారు. 2009లో టీడీపీ మహా కూటమి తరఫున పోటీ చేసి పోదెం వీరయ్యపై గెలుపొంది తొలిసారిగా శాసనసభ సభ్యురాలిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఒటమి పాలయ్యారు. 2017లో రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు. 2022 డిసెంబర్ 10న తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమితులయ్యారు. అనంతరం ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొంది తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు.
ఎంపీటీసీ నుంచి మంత్రిగా సురేఖ
వరంగల్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): వరంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరికి చెందిన కొండా సురేఖ 1995లో కాంగ్రెస్ తరఫున వంచనగిరి ఎంపీటీసీగా.. గీసుగొండ మండల ఎంపీపీగా గెలుపొందడంతో అప్పటినుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1999లో శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. 1999లో మహిళా, శిశు సంక్షేమ కమిటీ సభ్యురాలిగా, ఆరోగ్య, ప్రాథమిక విద్య స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. 2000లో ఏఐసీసీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2004లో రెండోసారి శాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యదర్శిగా, ఏఐసీసీ కో ఆప్షన్ సభ్యురాలిగా, అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా పనిచేశారు. 2005లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో మెంబర్గా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రి వర్గంలో తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో వరంగల్ తూర్పు నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెచారు. 2023 ఎన్నికల్లోనూ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రెండోసారి మంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ రెండో సారి జిల్లా నుంచి మంత్రి అయ్యారు.
నలుగురు సీఎంల మంత్రి వర్గాల్లో దుద్దిళ్ల
కాటారం, డిసెంబర్ 7 : కాటారం మండలం ధన్వాడకు చెందిన దుద్దిళ్ల శ్రీధర్బాబు 1999లో మొదటిసారిగా మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా మూడు పర్యాయాలు 1999, 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో సీఎంలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి , కిరణ్కుమార్ రెడ్డి, రోశయ్య మంత్రి వర్గంలో శ్రీధర్బాబు మంత్రిగా పని చేశారు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా నియమితులయ్యారు. ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్గా పని చేశారు.