గిర్మాజీపేట, ఫిబ్రవరి 23 : ఆలయాలు, ఇండ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని వరంగల్ సీసీఎస్, ఖానాపురం పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన వాహనాలను కొనుగోలు చేసిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 60 వేల విలువైన యాక్టివా, రూ. 25 వేల విలువైన మోపెడ్, రూ. 15 వేల విలువైన హెచ్పీ ల్యాప్టాప్, హుండీలు, మొబైల్, రూ. 47 వేల విలువైన దేవతామూర్తుల బంగారు, వెండి ప్రతిమలు తదితర వస్తువులు సుమారు రూ. 1,80,267 సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ సీసీఎస్ కార్యాలయంలో పోలీసులు వివరాలను వెల్లడించారు.
తూర్పు కోటకు చెందిన సంగ ప్రణయ్, రంగారెడ్డి జిల్లా బోడుప్పల్కు చెందిన ఎస్కే సాహిల్ పాత నేరస్తులు. నిందితులపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. గతంలో వీరు పలు దొంగతనం కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లారు. ఇద్దరికి జైల్లో పరిచయం ఏర్పడింది. గత డిసెంబర్లో జైలు నుంచి బయటికి వచ్చాక ఇద్దరు కలిసి ఓ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించారు. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం దొంగతనాలు చేస్తున్నారు. ఇంతెజార్గంజ్ పీఎస్ పరిధిలో యాక్టివా, చిల్పూర్ పరిధిలో స్లెండర్, మొబైల్, వేములవాడటౌన్, బోయినిపల్లి పీఎస్ పరిధిలో, రాచకొండ కమిషనరేట్ పరిధిలో యాక్టివా, హయత్నగర్ పరిధిలో ఇంటి తాళం పగులగొట్టి ఇలా వరుసగా 18 దొంగతనాలకు పాల్పడ్డారు.
వరంగల్ పరిధిలో దొంగిలించిన యాక్టివాను బక్కి సుమంత్కు నిందితులు విక్రయించారు. అతడు దాన్ని కడమంచి సుధాకర్కు అమ్మాడు. ఆ వెహికల్ను స్క్రాప్లో అమ్మేందుకు సుధాకర్ ప్రయత్నించాడు. కాగా, వరుస దొంగతనాల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమేశ్కుమార్, సిబ్బంది నిందితులపై నిఘా పెట్టారు. నిందితులు పాకాల, అశోక్నగర్ ఏరియాల్లో తిరుగుతున్నారనే సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు, ఖానాపురం ఎస్సై తిరుపతి వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న సిబ్బందిని సీపీ రంగనాథ్ అభినందించారు.