జనగామ, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ‘ఉద్యమ వీరుడా.. అలుపెరుగని యోధుడా.. జోహార్ సంపతన్న.. జోహార్ జోహార్.. నీకివే మా కన్నీటి వీడ్కోలు’ అంటూ జనగామ జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డికి గులాబీశ్రేణులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధాంజలి ఘటించారు. గుండెపోటుతో హఠాన్మరణం పొందిన పాగాల సంతాప సభ బుధవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. జడ్పీచైర్మన్గా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా సంపత్రెడ్డి సేవలను కొనియాడుతూ నివాళులర్పించారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొన్నారని, పదవుల కోసం ఆశపడి ఎవరూ రాలేదన్నారు. సంపత్రెడ్డి కూడా ఉద్యమంలోకి అలాగే వచ్చారని చెప్పారు. ఉద్యమకారుడు సంపత్రెడ్డికి మంచి పదవి కట్టబెట్టాలని ప్రతిసారి కేసీఆర్ గుర్తు చేసేవారని, అందుకే ఆయనకు జడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జోడు పదవులు అప్పగించారని గుర్తు చేశారు. సంపత్ మీద కేసీఆర్కు ఏనలేని ప్రేమ ఉంటుందన్నారు. సంపత్ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలుగనివ్వమన్నారు. ప్రభుత్వం లేదని నాయకులు, కార్యకర్తలు అధైర్య పడొద్దని, ఎలాంటి బాధ వచ్చిన జిల్లా నుంచి గెలిచిన కడియం శ్రీహరి, తాను చూసుకుంటామని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ఇండ్లపై దా డులు చేస్తున్నారని, అనవసరంగా దూషిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ‘కేసీఆర్ నాయకత్వంలో మనం మళ్లీ గెలుస్తాం.. అందరం ఓపిక పడుదాం.. గులాబీ జెండాకు అండగా ఉందాం’ అని పిలుపునిచ్చారు.
సంపత్రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం.. : కడియం
పార్టీ ఓటమి పాలయ్యిందనే బాధతో సంపత్రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందడం బాధగా ఉం దని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే క డియం శ్రీహరి అన్నారు. పార్టీ ఓడిపోతుందని అనుకోలేదని, భయంగా ఉందని తనతో చెప్పాడని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని తాను చెప్పానని గుర్తుచేశారు. సంపత్రెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. సంపత్రెడ్డి కుమార్తె చదువు బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక స్టేషన్ఘన్పూర్, జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాడర్ను కొంత ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే కాదు.. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంతో తనకు అనుబంధం ఉందని, వందకు వంద శాతం పార్టీ కార్యకర్తలు, వారి ఆస్తులను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. మంచి రోజులు వచ్చేదాకా ఓపిక పట్టాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మలిదశ ఉద్యమనేత పాగాల : తాటికొండ
మలిదశ ఉద్యమ ముఖ్య భూమిక పోషించిన పాగాల సంపత్రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలను, అభివృద్ధి ఫలాలను జిల్లా ప్రజలకు అందించాడని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. రెండు దశాబ్దాలకు పైగా గులాబీ పార్టీతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.