హనుమకొండ, సెప్టెంబర్ 9 : జీవితమే సాహిత్యం.. సాహిత్యమే జీవితంగా తొమ్మిది పదుల జీవితాన్ని గడిపిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు 109వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో నిర్వహించిన తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ఈ సారి కాళోజీ నడయాడిన ఓరుగల్లు గడ్డపై ప్రత్యేకంగా కవి సమ్మేళనం నిర్వహించడం విశేషం.
ఈ కవి సమ్మేళనంతో 25 మంది తెలుగు, ఉర్దూ కవులు పాల్గొని కాళోజీ జీవితం, సాహిత్యం, ప్రజా సంబంధాలు తదితర అంశాలపై కవితా గానం చేసి సభికులను ఆకట్టుకున్నారు. మొదటి సెషన్లో జరిగిన కవి సమ్మేళనానికి కాళోజీ ఫౌండేషన్ కార్యదర్శి వీఆర్ విద్యార్థి అధ్యక్షత వహించారు. కాళోజీతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ దేవులపల్లి వాణి, ఉదయశ్రీ ప్రభాకర్, సిరాజొద్దీన్, తిరునగరి నరేందర్, మహషర్ మీర్జా, కొమ్మరాజు రామలక్ష్మి, బిల్లా మహేందర్, తాడిచర్ల రవి మొదటి సెషన్లో పాల్గొన్నారు. రెండో సెషన్లో పొట్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన కవి సమ్మేళనం కొనసాగింది. అన్వర్, రామా రత్నమాల, ఆస్నాల శ్రీనివాస్, వహీద్ గుల్షన్, డాక్టర్ మంతెన శంకర్, కర్రె సదాశివ్ తదితరులు చేసిన కవితాగానం మంత్ర ముగ్దులను చేసింది.
కవి సమ్మేళనంలో వల్సపైడీ చేసిన వాఖ్యానం ఆకట్టుకుంది. జిల్లా సాంస్కృతిక మండలి కళాకారులు ఆలపించిన ఉద్యమ గీతాలు మైమరింప జేశాయి. ప్రముఖ నృత్యగురువు బొమ్మనపెల్లి శిశ్య బృందం ప్రదర్శించిన రాణి రుద్రమదేవి నృత్యాలు రంజింప చేశాయి. కాళోజీ జీవిత చరిత్ర ఆధారంగా డాక్టర్ జీ కుమారస్వామి రూపొందించిన (దర్శకుడు) ‘ నా కలలు – నా ప్రపంచం’ అనే నాటకం కాళోజీ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపింది. నాటకాన్ని ఎంతో అద్భుతంగా ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కాళోజీ పాత్రను పోశించిన వేములవాడకు చెందిన శివరామిరెడ్డి నటన ఆకట్టుకుంది. అతిథులు నాటకాన్ని ప్రదర్శించిన దర్శకున్ని, పాత్రధారులను అభినందించారు.