శాయంపేట, జనవరి 12 : శాయంపేట మండలం జోగంపల్లి శివారు చలివాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు గోదావరి జలాల తరలింపు రెండు నెలల్లో మొదలు కానున్నట్లు అధికారులు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అత్యం త ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్కుకు చలివాగు నుంచి నీరందించేందుకు రూ.100 కోట్లతో పనులు చేపట్టారు. టెక్స్టైల్ పార్కులో సంప్ పూర్తికాగా ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు కొనసాగుతున్నాయి. కాంట్రాక్ట్ గడువు ఈ నెల వరకే ఉండగా మరో ఆరు నెలలు పొడిగించారు. పార్కుకు ఏటా 0.163 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు.
ప్రాజెక్టు నుంచి మైలారం ద్వారా గూడెప్పాడ్, ఆగ్రంపాడ్, అక్కంపేట, మీదుగా కాకతీయ కెనాల్ నుంచి గీసుకొండ ద్వారా టెక్స్టైల్ పార్కుకు 40 కిలోమీటర్ల పైపులైన్ వేశారు. మధ్యలో రెండు చోట్ల 30మీటర్ల చొప్పున రోడ్డు పనులు చేపట్టాల్సి ఉన్నది. పార్కులో రెండు ఇంటర్నల్ రోడ్లు పూర్తి చేయాల్సి ఉంది. సంగెం మండలం రాయినికుంట (చింతలపల్లి) పరిధిలో పారు కోసం 1200 ఎంఎల్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. చలివాగులో ఇంటేక్వెల్ నిర్మాణం పూర్తికాగా గేట్లు బిగించనున్నారు. 240 హెచ్పీ స్థాయి మూడు మోటర్లు బిగించి రెండింటిని వినియోగిస్తారు.