ములుగు, మే 14 (నమస్తే తెలంగాణ): రాతియుగం మానవ స్మారక శిలలను టీమ్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ కల్చర్ అండ్ హెరిటేజ్ (టార్చ్) సభ్యులు ఆదివారం ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తూరు-మొట్లగూడెం సమీపంలో ఉన్న రాజారామ్ సుద్దగుట్ట పరిధిలో గుర్తించారు. యువ చరిత్రకారుడు, టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ఆర్య మాట్లాడుతూ ఆదిమానవులు సమాధుల వద్ద నిలువు రాళ్లను పాతే వారని, సమూహంలో ముఖ్యుల సమాధుల వద్ద పాతే ఇలాంటి రాళ్లను ‘మెన్హిర్లు’ లేదా నిలువు రాళ్లు అంటారని తెలిపారు. నిలువు రాళ్లు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఉన్నప్పటికీ, మానవాకృతిలో ఉన్న మెన్హిర్లు మాత్రం అరుదు అని చెప్పారు.
ఆంత్రోపోమార్ఫిక్ ఫిగర్స్గా పేర్కొనే ఈ రాళ్లు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పరిమితంగా కనిపిస్తాయని వెల్లడించారు. 6 అడుగుల ఎత్తు, నాలుగున్నర అడుగుల వెడల్పు, గుండ్రని తల, దీర్ఘచతురస్రాకారపు చాతి, భుజాలు, నడుము మానవుడిని పోల్చుకునేలా రాళ్లు చెక్కి ఉన్నాయని వివరించారు. ఖమ్మం జిల్లాలోని కాచనపల్లి, గలబ, గుండాల ప్రాంతాల్లోని ఇలాంటి రాళ్లను పురుష, మహిళా రూపాల్లోనూ చెక్కి ఉన్నాయని తెలిపారు. ఇవి గోదావరి నది పరివాహక ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ప్రాచీన మానవుడి ఉనికితోపాటు మానవ జాతుల పరినామ క్రమాలను తెలియచెబుతాయని పేర్కొన్నారు. టార్చ్ టీమ్తోపాటు మొట్లగూడెంకు బంగారి మోహన్, బీ కార్తీక్, శ్రీకాంత్ ఉన్నారు.