దీపావళి అంటే దీపాల వరుస.. పటాకుల మోతలు.. కాకరపూల కాంతులు.. భూచక్రాల వెలుగులు.. చిచ్చుబుడ్ల జిలుగులు.. పసందైన పిండివంటలే కాదు.., అల్లరి పిల్లలు, పిల్లల్లా మారే పెద్దలు, కేరింతలు, తుల్లింతలు కలగలిసిన పండుగ! వెలుగుపూల వేడుక! చీకట్లను పారదోలి వెలుగులను నింపే దివ్వెల పండుగ దీపావళికి అంతా సిద్ధమైంది. ఇళ్లను శుద్ధి చేసి రంగురంగుల పూలు, మామిడాకుల తోరణాలతో అలంకరించుకున్నారు. కుటుంబసభ్యులు, బంధువులతో ప్రతి ఇళ్లూ శోభను సంతరించకోగా, లక్ష్మీ పూజలు, కేదారేశ్వర నోములకు ఏర్పాట్లు చేసుకున్నారు.
-నర్సంపేట/నర్సంపేట రూరల్, అక్టోబర్ 23
దివ్వెల పండుగ దీపావళి పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. విజయానికి ప్రతీకగా, చీకట్లను పారదోలి జీవితాల్లో వెలుగుల నింపే పండుగగా ఘనంగా జరుపుకుంటారు. పండుగకు మూడు నాలుగు రోజుల ముందు నుంచే ఇళ్లలో సందడి మొదలు కాగా, సున్నాలు వేయడం, శుద్ధి చేసుకోవడం, రంగురంగుల పూలు, మామిడాకు తోరణాలు, దీపాల ప్రతిమలతో అలంకరించుకున్నారు. నోముల పూజా సామగ్రి కొనుగోళ్లలో బిజీగా ఉన్నారు. మర్రి ఆకులు, మర్రి పండ్లు, మర్రి ఊడలు, మామిడి ఆకులు, బంతిపూలు, గుమ్మడి కాయలు తదితర వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
కుటుంబ సభ్యులకు తోడు, బంధుమిత్రులు తరలిరావడంతో ఇళ్లన్నీ నోముశోభను సంతరించుకున్నాయి. పూజా సామగ్రి, ప్రమిదల అమ్మకాలతో వరంగల్, హనుమకొండ, కాజీపేట, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రాల్లోని ప్రధాన రహదారులు రద్దీగా మారాయి. కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. ఇక దీపావళి అంటే పటాకుల మోత. ప్రతి ఇంటింటా సందడే సందడి. బట్టల వ్యాపారాలు, కిరాణా వ్యాపారాలు, దీపావళి పటాకులు, పువ్వులు మొదలుకొని నోముల సామగ్రి వరకు అన్నింటికీ మంచి గిరాకీ ఉంటుంది. పండుగకు వారం రోజుల ముందు నుంచి వ్యాపారాల సందడి. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ పండుగను ఎంజాయ్ చేస్తారు.
మార్కెట్లలో సందడి
దీపావళి పటాకుల వ్యాపారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోట్లలో నడుస్తుంది. గత సంవత్సరం కన్నా ఈ సారి ధరలు పెరిగాయి. ముడిసరుకుల ధరలు పెరగడం పటాకుల ధరలకు రెక్కలొచ్చాయి. అన్ని రకాల బాంబులపై గతేడాది కన్నా ఈ సారి 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెరిగాయి. ఇక దీపావళి పటాకుల్లో ఫ్యాన్సీ నావల్టీస్ కొనుగోలుపై ప్రజలు మక్కువ చూపిస్తున్నారు. పేలుడువి కాకుండా పువ్వులు వచ్చే క్రాకర్స్, మతాబులను విక్రయిస్తున్నారు.
పటాకులు కాల్చే సమయంలో జాగ్రత్త
పటాకులు కాల్చే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పెద్దపెద్ద బాంబులు కాల్చేప్పుడు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు వాటిని కాల్చకుండా ఉండడమే మేలు. చిన్నపిల్లలను బాంబులు కాల్చే చోటుకు రానివ్వొద్దు. వారికి స్థాయిని బట్టి కాల్చే అవకాశం ఇవ్వాలి. తల్లిదండ్రులు, బంధువులు గమనిస్తుండాలి. పొగ ఎక్కువగా వచ్చే పటాకుల వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. దమ్ము, దగ్గు ఉన్న వారిని దూరంగా ఉంచితే మంచిది. ముఖ్యంగా స్త్రీలు కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. స్కిల్ చీరెలు, దుస్తుల వల్ల చిన్న నిప్పురవ్వ మీద పడినా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకుని దీపావళీని రంగులమయంగా చేసుకోవాలని ఆకాంక్షిద్దాం.
ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్..
పటాకులు లేకుంటే పండుగ సంబురమే లేదని చాలామంది భావిస్తారు. అలాంటి వారి కోసమే ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటితో పర్యావరణహిత దీపావళి ఆనందమే కాదు ఆరోగ్యం కూడా. ప్రమాదకరమైన రసాయనాలతో నిండిన పటాకులు పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తాయి. వాటి పొగ వల్ల ఊపిరితిత్తుల సమస్య.., విపరీతమైన శబ్దాలతో చెవులు దెబ్బతినే ప్రమాదం ఉంది. పర్యావరణానికి హాని కలిగించే పటాకులకు ‘నో’ చెప్పి దీపాలంకరణలతో ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ను కూడా చాలా తక్కువ వినియోగిస్తూ పండుగ జరుపుకుందాం.