కురవి, జూలై 06 : మహబూబాబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలోని పురాతనమైన మహిమాన్వితమైన భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం పూజారులు కొత్త నీటి (పారుతున్న నది నుండి)ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జమాండ్లపల్లి మున్నేరు నది నుండి ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చారు. గ్రామ పొలిమేరల నుండి మేల తాళాలతో వేదమంత్రాలతో ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ అధికారులు, పాలక మండలి చైర్మన్ కొర్ను రవీందర్ రెడ్డి, సభ్యులు ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్ గౌడ్, చిన్నం గణేష్, జనార్దన్ రెడ్డి, సక్రు నాయక్, సోమ్లా, సంజీవరెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
ఏటి నీటిని ఆలయంలోని ముఖ మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూలవిరాట్టు స్వామి వారికి మహన్యాసక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. గణపతి పూజ తో ఆరంభమైన ప్రత్యేక పూజలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా పూజారులు మాట్లాడుతూ హిందువులకు తొలి ఏకాదశి తొలి పండుగని, పాడి పంటలు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తొలి ఏకాదశి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
తొలి ఏకాదశి పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు స్వామి వారి అభిషేకం నీటిని సీసాలలో, ప్రత్యేక పాత్రలలో ఇండ్లకు తీసుకు వెళ్లారు. ఈ పూజా కార్యక్రమంలో అర్చకులు, వేదపండితులు రెడ్యాల శ్రీనివాస్, పెనుగొండ అనిల్, దూసకంటి విజయ్ కుమార్, విజయ్, తేజ, పుణ్యమూర్తి, రమేష్, అభిలాష్, శ్రీకాంత్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.