అదునుకు ‘రైతుబంధు’ సాయం అందుతుండడంతో రైతుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. రోజువారీగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమచేస్తుండడంతో వాటిని అందుకొని సంబురంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మెజార్టీ రైతుల చేతికి సర్కారు సాయం అందగా, మరికొందరికి షెడ్యూల్ ప్రకారం పంపిణీ చేస్తున్నారు. ప్రతి సీజన్ ఆరంభంలో పెట్టుబడి కష్టాలు తీర్చి వ్యవసాయ పనులకు ఇబ్బంది లేకుండా ఆదుకుంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. శుక్రవారం ఆయాచోట్ల పొలం పనులు చేసుకుంటున్న రైతులు.. ‘రైతుబంధు’తో తమకు కలిగిన ప్రయోజనం, మార్చిన బతుకు విధానాన్ని ‘నమస్తే’తో పంచుకున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్,
జనవరి 6 పడావు పడ్డ భూములన్నీ పచ్చగైనయ్..
దేవరుప్పుల: కేసీఆర్ ఎవుసంపై పెట్టిన ప్రత్యేక శ్రద్ధతో పడావు పడ్డ భూములన్నీ పచ్చగైనయ్. గతంల గిట్టుబాటుకాక అప్పులపాలై వలసలెల్లిన కుటుంబాలు ఊరు బాట పట్టినయ్. కరంటు, నీళ్లు ఫుల్లు, రైతుబంధు డబ్బులతో రైతులు సంబురంగ నాటు పెడుతుండ్రు. మద్దతు ధరలతో ఖుషీగ ఉన్నరు. దేశంల ఎక్కడ కూడ పెట్టబడికి పైసలిస్తలేరు. ఇచ్చే దమ్ము లేదు. కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వత్తే అందరికి రైతుబంధు పైసలు అందుతయ్. అట్లగె రోజంత కరంటు, మస్తుగ నీళ్లు ఇచ్చి రైతు రాజ్యం తెస్తడు. నాపేర ఎకరం భూమి ఉంటే రూ. 5 వేలు మొన్ననే పడ్డయ్. ఇగ నాటు పెడుత.
– మాచర్ల యాదగిరి, రైతు, కోలుకొండ(దేవరుప్పల)
ఇత్తనాలు, ఎరువులు తెచ్చిన..
కేసముద్రం: కేసీఆర్ డబ్బులు అదునుకు రావడం సంతోషంగ ఉంది. ఈ పైసల్తో 2 ఎకరాల్ల మక్కలు ఏయడానికి ఇత్తనాలు, 3 ఎరువుల బత్తాలు తెచ్చిన. రైతుబంధు రాకుంటే అప్పుకు తీసుకొచ్చేటోన్ని. రెండు దఫాల ఎకరానికి రూ. 10 వేలు సీఎం కేసీఆర్ ఇత్త్తుండడంతో ఆ అవసరం అత్త లేదు. గతంల జనవరి వచ్చిందంటే నీళ్లు లేక పంటలకు ఇబ్బందిగ ఉండేది. ఇప్పుడు మస్తు నీళ్లతోపాటు, పెట్టుబడికి పైసల్, రోజు మొత్తం కరంట్ ఇయ్యడంతో సాలుకు 2 పంటలు పండిత్తానం. గిరిజనులు అందరం సీఎం కేసీఆర్కు అండగా ఉంటరు.
– నునావత్ శ్రీను, రైతు, కోమటిపల్లి (కేసముద్రం)
సాయం మరువం..
నడికూడ: నాకు నాలుగెకరాల ఎవుసం భూమి ఉన్నది. రెండు ఎకరాలు పోరగాండ్ల పేర పట్టాలు చేశినం. అందరికి రైతుబంధు పైసలు పడ్తానయ్. మూడెకరాల్ల మిర్చి, ఎకరంల నాటేసినం. పంటలకు కావల్సిన నీళ్లు, పెట్టుబడి, రైతుకు అనుకోకుండ ఏమన్న ప్రమాదం జరిగి చనిపోతే రూ. ఐదు లక్షల బీమా.. ఇట్ల సీఎం సారు అన్నీ ఇస్తాండు. చాలా సంతోషంగా ఉన్నది. ఆయన సాయం మరువం.
– జీల చేరాలు, రైతు, గొల్లపల్లి(నడికూడ)
బాధలు తీరినయ్
జయశంకర్ భూపాలపల్లి(నమస్తే తెలంగాణ): కేసీఆర్ సారు ఇత్తున్న రైతుబంధుతో నాకున్న ఇబ్బందులు తీరినై. నా పేరిట నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. దాంట్లో వడ్లు పండిత్తాన. ఇంతకుముందు పెట్టుబడి లేక, కరంటు సరిగా రాక, నాకున్న రెండున్నర ఎకరాలను పడావు పెట్టిన. ఇంకా రెండెకరాల్లో వడ్లు పండిచ్చిన. ఈ రెండెకరాలకు కూడా పెట్టుబడి కావాలంటే అప్పుడు అడ్తిదారుల దగ్గరికి, వడ్డీలు ఇచ్చేటోళ్ల దగ్గరికి పోయి తెచ్చుకునేటోణ్ణి. అడ్తిదారులు, మిత్తిలోళ్లు నమ్మకం ఉంటనే ఇచ్చెటోళ్లు. అప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డం. సీఎం కేసీఆర్ సారు ఏడాదికి రైతుబంధు రెండు పంటలకు పైసలు ఏత్తున్నడు. పెట్టుబడికి అప్పు తెచ్చే బాధ తప్పింది. ఈ పైసలతో ఇత్తనాలు, మందు బస్తాలు కొంటాన. అదునుకు నాటు పడి వడ్లు మంచిగనే పండుతున్నై. ఇప్పుడు ఎవ్వల దగ్గరికి పోయి చేయి చాచాల్సిన అవసరం లేదు. పండిన వడ్లు కూడా సర్కారే కొంటాంది. నాలుగు రోజుల క్రితం వానకాలం పండిన వడ్లు 64 క్వింటాళ్లు కాంటా పెట్టిన. కరంటు కూడా 24 గంటలు వత్తాంది. చాల సంతోషంగ ఉంది.
– ఎర్రవల్లి శంకర్రావు, బ్రాహ్మణపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా