పర్వతగిరి, జూన్ 15 : దేశంలోనే అభివృద్ధికి నిలయంగా తెలంగాణ గ్రామాలు ఆవిర్భవించాయని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పర్వతగిరి మండల కేంద్రంలో నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే, బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే దేశ ప్రగతికి నిదర్శనమని భావించి, పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగానే గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, మురుగు కాల్వలను శుభ్రం చేయించి, హరితహారం, నర్సరీ, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు చేపట్టారన్నారు. దీంతో తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శంగా మారాయన్నారు.
పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి జీపీకి ట్రాక్టర్తో పాటు, ట్రాలీ, ట్యాంకర్ను కొనుగోలు చేసి, అందించినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డుతో పాటు అందులో సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించినట్లు చెప్పారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి రూ.2.50 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాల నిర్మాణానికి రూ.12.60 లక్షలు కేటాయించినట్లు వివరించారు. రాష్ట్రంలో అటవీశాతం పెంచాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో అర ఎకరం నుంచి ఎకరం వరకు స్థలాన్ని సేకరించి, పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే, గ్రామాలను పచ్చగా ఉంచేందుకు ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పా టు చేసి, హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందన్నారు. ఒక్క పర్వతగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పటి వరకు పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.116.52 కోట్లు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు.
కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కల్పన, డీఆర్డీవో సంపత్రావు, ఎంపీపీ కమల, సర్పంచ్ మాలతీ సోమేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్గౌడ్, ఎంపీటీసీలు మాడ్గుల రా జు, బొట్ల మహేంద్ర, మార్కెట్ డైరెక్టర్లు శాంతిరతన్రావు, ఏకాంతంగౌడ్, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, సర్వర్, చిన్నపాక శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు రజిత, ఎంపీడీవో చక్రాల సంతో ష్ కుమార్, తహసీల్దార్ కోమి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మె ల్యే చేతుల మీదుగా ఉత్తమ జీపీ సిబ్బందిని సన్మానించారు. మహిళలు బోనా లు, పూలతో ఎమ్మెల్యే అరూరి రమేశ్కు స్వాగతం పలికారు. గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.