హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 21: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో మరోసారి సమ్మె సైరన్ మోగింది. వివిధ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ జేఏసీ (జాక్) సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నారు. దీంతో బుధవారం మొదటి షిఫ్ట్ నుంచే బస్సులు బంద్ కానున్నాయి. వరంగల్ రీజియన్ పరిధిలో 9 డిపోలుండగా, ఎలక్ట్రిక్ బసులు మినహా మిగతావన్నీ డిపోలకే పరిమితం కానుండగా ప్రజా రవాణా నిలిచిపోనున్నది.
ప్రజలు ప్రయాణాలు చేయొద్దంటూ ముందుగానే కార్మిక సంఘాల నాయకులు సూచించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన కమిటీ నాలుగు వారాల సమయం కోరగా అందుకు ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె అనివార్యమైంది వరంగల్ రీజియన్ పరిధిలో హనుమకొండ, వరంగల్-1, వరంగల్-2, మహబూబాబాద్, తొర్రూరు, భూపాలపల్లి, జనగామ, పరకాల, నర్సంపేట డిపోల్లోని సుమారు 4 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, సూపర్వైజర్లు, ఉద్యోగులు సైతం సమ్మెలో పాల్గొననున్నారు. మొత్తం 920 వరకు ఆర్టీసీ బస్సులుండగా అందులో 230 అద్దె బస్సులు, 112 ఎలక్ట్రిక్ బస్సులున్నాయి. అద్దె బస్సులను ప్రైవేట్ డ్రైవర్లు, ఔట్సోర్సింగ్ కండక్టర్లతో నడిపిస్తున్నారు.
యథావిధిగా ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు. వరంగల్ రీజియన్ పరిధిలో రోజుకు లక్ష నుంచి 2 లక్ష మంది బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ప్రతిరోజు వచ్చే రూ. 1.50 కోట్ల ఆదాయానికి అడ్డుకట్ట పడనుంది. ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ అమలుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనుండటంతో ప్రజారవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులతో నడిపించేందుకు చర్యలు చేపడుతున్నది. జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ప్రైవేట్ డ్రైవర్లను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తున్నది. బెంగుళూరు, ఖమ్మం, ఏటూరునాగారం తదితర రూట్లలో రవాణా వ్యవస్థకు ఆటంకం కలగనుంది. ముఖ్యంగా హనుమకొండ బస్స్టేషన్ నుంచే ప్రతిరోజూ ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడనున్నారు.