వర్ధన్నపేట, సెప్టెంబర్ 9: మహిళా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట మండలం ల్యాబర్తి, బొక్కలగూడెం గ్రామైక్య సంఘాల 19వ వార్షిక మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు పావలా వడ్డీకే కోట్లాది రూపాయల రుణాలను బ్యాంకుల ద్వారా మంజూరు చేసినట్లు తెలిపారు.
మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధిస్తే గ్రామాల్లో పేదరికం క్రమంగా తగ్గుతుందని సీఎం కేసీఆర్ బలంగా నమ్ముతారని పేర్కొన్నారు. అందుకని మహిళను స్వయం ఉపాధిరంగంలో ప్రోత్సహించేందుకు గ్రామైక్య సంఘాల ద్వారా పావలా వడ్డీకే రుణాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు కూడా ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొని కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవా లని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే రుణాలను కుటుంబ అవసరాలకు కాకుండా ఆర్థిక ప్రగతికి ఉపయోగించుకోవాలన్నారు. స్వయం ఉపాధి కోసం వెచ్చిస్తే ఆర్థిక వనరులు పెరుగుతాయన్నారు.
అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గల మహిళలకు ఉపాధి రంగంలో శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే బ్యుటీషియన్ కోర్సులో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన మహిళలకు ఉచితంగా శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, సర్పంచ్లు పస్తం రాజు, వెంకటనారాయణ, ఎంపీటీసీ ఉమాదేవి, ఉపసర్పంచ్ పిన్నింటి కళింగరావు, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, ఆత్మ చైర్మన్ గోపాల్రావు పాల్గొన్నారు.
పర్వతగిరిలో మహిళా సంఘాల మహాసభ
పర్వతగిరి: మండలంలోని అన్నారం, కల్లెడ గ్రామాల మహిళా సంఘాల వార్షిక మహాసభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరూరి రమేశ్ మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. మహిళా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీలేని రుణాలు, పావలావడ్డీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పరిపాలనలోనే తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని తెలిపారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న వీవోఏల గౌరవ వేతనాలను పెంచి మహిళలపై తన అభిమానాన్ని కేసీఆర్ చాటుకున్నారని చెప్పారు. కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. జడ్పీటీసీ సింగ్లాల్, ఎంపీపీ కమల పంతులు, సర్పంచ్లు సంపెల్లి శోభ పరమేశ్వర్రావు, యశోద బాబు, పీఏసీఎస్ చైర్మన్లు మనోజ్కుమార్గౌడ్, గొర్రె దేవేందర్, ఏపీఎం క్రిష్ణమూర్తి, ఆర్పీఎస్ కోఆర్డినేటర్ చిన్నపాక శ్రీనివాస్, జడ్పీ సభ్యులు సర్వర్ పాల్గొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట
ఐనవోలు: మండలంలోని పంథినిలో శ్రీరాం, సాయిరామ్ సంఘాల సర్వసభ్య సమావేశం, వార్షిక మహాసభ సమావేశం శనివారం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మహిళ సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. అనంతరం వీవో నిర్మాణం కోసం రూ.10లక్షల ప్రొసీడింగ్ కాపీని ఎమ్మెల్యే మహిళా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. కాగా వీవో భవనం నిర్మాణ నిధులను పెంచాలని కోరుతూ మహిళా సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఉస్మాన్అలీ, సర్పంచ్ కర్మిళ్ల ప్రేమలత, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సోమేశ్వర్రావు, ఏపీఎం చీకటి రాజ్కుమార్, సీసీ మోహన్బాబు, వీవోల ప్రతినిధులు మడూరి జ్యోతి, సట్ల లక్ష్మీ భవానీ, వీవోఏలు కోదాటి మంజుల, పేరాల సమ్మక్క, మాజీ సర్పంచ్ సదానందం పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
నయీంనగర్: గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ భీమారానికి చెందిన నరేందర్కు ముఖ్యమంత్రి సహాయనిధి (ఎల్వోసీ) రూ.2లక్షల చెక్కును వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ హనుమకొండ ప్రశాంత్నగర్లోని ఆయన నివాసంలో అందచేశారు. స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు, సంగాల చిన్న, అటికం రవీందర్, విక్టరీ బాబు, దయాకర్ పాల్గొన్నారు.