రైతులను మోసం చేస్తున్న దళారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. పంట ఉత్పత్తులకు అధిక ధరల ఆశ చూపించి కొనుగోలు చేశాక డబ్బులు ఇవ్వకుండా మొఖం చాటేస్తున్న వీరిపై కేసులు నమోదు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. సర్కారు ఆదేశాలతో వ్యాపారులపై ఖాకీలు కొరడా ఝలిపిస్తున్నారు. ఇప్పటికే ఒకరిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. రైస్ మిల్లర్ల అక్రమాలపై కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. బస్తాకు 5 కిలోలు తరుగు తీసిన హసన్పర్తి మండలంలోని సప్తగిరి రైస్ మిల్లును సీజ్ చేయడంతో పాటు యజమాని, సిబ్బందిపై కేసు నమోదు చేశారు. అన్నదాతలను మోసం చేసే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని సీపీ రంగనాథ్ హెచ్చరించారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని కోరారు.
హనుమకొండ సబర్బన్, మే 19 : విత్తనాలు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ దళారులు కొంతమంది రైతులకు అధిక ధరల ఆశ చూపి ప్రతియేటా కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపినా రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు దృష్ట్యా ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తున్నది. అయితే రైస్ మిల్లర్లు మాత్రం క్వింటాల్కు 12 కిలోల మేర తరుగు పేరిట కోతలు విధిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు. అలాగే కొందరు దళారులు కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా ముఖం చాటేస్తున్నారు. ఇలాంటి మోసాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
హనుమకొండ జిల్లాలో 1.4 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 60 వేల ఎకరాల్లో మక్కజొన్న పంట వేశారు. మక్కలు, వడ్లకు డిమాండ్ ఉన్న సందర్భంలో ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవడం పరిపాటిగా మారింది. అయితే కొందరు దళారులు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించే సమయంలో ముఖం చాటేస్తున్నారు. రైతులు డబ్బుల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నా ఇవ్వకపోగా, బెదిరింపులకు గురి చేస్తున్నారు. ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన రైతులు వరంగల్ జిల్లాలోని చెన్నారావు పేట మండలానికి చెందిన వ్యక్తికి ధాన్యం విక్రయించి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ డబ్బులు మాత్రం చెల్లించలేదు.
పోలీసులను ఆశ్రయిస్తే కేవలం రూ.2 లక్షలు ఇచ్చి మిగతావి తర్వాత ఇస్తానని సదరు వ్యాపారి చేతులు దులుపుకున్నాడు. ఎల్కతుర్తి, హసన్పర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి, ధర్మసాగర్ మండలాలకు చెందిన పలువురు రైతుల నుంచి వందలాది టన్నుల మేరకు మక్కలు, ధాన్యం తీసుకెళ్లిన దళారులు డబ్బులు మాత్రం చెల్లించడం లేదు. ఈ దందాపై గతంలోనే నమస్తే తెలంగాణలో ‘ధాన్యం దళారులు’ అనే కథనాన్ని ప్రచురితమైంది. దీనికి తోడు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రైతులపై ఈగ వాలినా సహించేది లేదని తెగేసి చెప్పడంతో పోలీసుల అక్రమార్కులపై దూకుడు పెంచారు. ఈ క్రమంలో ధాన్యం కొని రైతులకు డబ్బులు చెల్లించని రవిబాబుపై ఏకంగా పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు.
రైతుల నుంచి వచ్చిన మేలు రకం ధాన్యం నుంచి బస్తాకు 5 కిలోలు తరుగు తీసిన హసన్పర్తి మండలంలోని సప్తగిరి రైస్ మిల్లును సీజ్ చేయడంతో పాటు యజమాని, సిబ్బందిపై కేసు నమోదు చేశారు. సదరు మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని కూడా వేరే మిల్లుకు మ్యాపింగ్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైతులను వ్యాపారులు మోసం చేస్తే కఠినంగా వ్యవహరించాలని కింది స్థాయి సిబ్బందికి సీపీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వానకాలం సీజన్ కోసం విత్తన విక్రయాలు కూడ మొదలయ్యాయి. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులతో స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
ధర్మసాగర్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి తూకంలో తేడా వస్తుందా అని అడిగి తెలుసుకున్నారు. మానుక కొంరయ్య అనే రైతు తూకంలో తేడా వచ్చిందని ఏసీపీ దృష్టికి తీసుకొచ్చాడు. దీనిపై విచారణ చేపట్టి సూర్య తేజ రైస్ మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేశ్ తెలిపారు.
ఏవీ రంగనాథ్, వరంగల్ పోలీస్ కమిషనర్
వ్యాపారులు రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు. ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు తరుగు పేరిట ఎక్కువగా కోతలు వేస్తున్న విషయంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఇలాంటి ఘటనలపై ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశాం. ధాన్యం కొనుగోలు చేసి డబ్బులను ఎగ్గొట్టాలని చూసే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పటికే ఒకరిపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపించాం. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పంట ఉత్పత్తులను అమ్ముకోవాలి. తెలియని వారికి ధాన్యం విక్రయించి మోసపొవద్దు.