ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గిరిజనుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకొని జీవిస్తున్న వారికి భూమి హక్కులు కల్పించి అండగా నిలిచేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీ ప్రక్రియ మొదలు కానుండగా, మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతిరాథోడ్తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహించి మాట్లాడనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,06,271 ఎకరాల భూమికి సంబంధించి పోడు పట్టాలు పంపిణీ చేయనుండగా, దాదాపు 39,537 మందికి లబ్ధి చేకూరనున్నది. అడవుల్లో ఇన్ని రోజులు తమ ఆధీనంలో ఉన్న భూములు అధికారికంగా తమ చేతికొస్తుండడంతో గిరిజనులు సంబురపడుతున్నారు.
వరంగల్, జూన్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఏళ్లుగా భూమిని నమ్ముకున్న వారికి రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. అడవిని ఆధారంగా చేసుకొని జీవించే వారికి హక్కులు కల్పిస్తున్నది. బతుకు కోసం పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం పట్టాలను పంపిణీ చేస్తున్నది. ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీ ప్రక్రియ మొదలుకానున్నది. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతిరాథోడ్తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహించనున్నారు.
అదేరోజు మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు గిరిజనులకు పోడు పట్టాలు అందవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోడు పట్టాల పంపిణీ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2845 గ్రామాలు, తండాలు, గూడేల పరిధిలో ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో ఉన్న 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి, ఏర్పాట్లు చేసింది.
మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 70వేల ఎకరాలు, ములుగు జిల్లాలో 18 వేల ఎకరాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 8537 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 8366 వేల ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 65 ఎకరాలకు సంబంధించి గిరిజనులకు హక్కులు కల్పించనున్నది. మహబూబాబాద్ జిల్లాలో లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు. ఈ జిల్లాలో దాదాపు 25వేల మందికి పోడు భూముల హక్కు పట్టాలు అందనున్నాయి. ములుగు జిల్లాలో 7413 వేల మందికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3654 మందికి, హనుమకొండ జిల్లాలో 70 మంది లబ్ధిదారులు ఉండగా, వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం హక్కు పత్రాలు ఇవ్వనున్నది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నది.
భూమి సర్వే నంబరు, భూమి ఉన్న అక్షాంశాలు, రేఖాంశాలు, భూమి ఉన్న హద్దులతో గూగుల్ మ్యాపింగ్ వివరాలతో హలోగ్రామ్ను పోడు పట్టాల్లో పొందుపరిచారు. అడవుల్లో తమ ఆధీనంలో ఉన్న భూములు అధికారికంగా తమ చేతికొస్తుండడంతో గిరిజనులు సంతోషంగా ఉన్నారు. పోడుభూముల పట్టాలు అందించిన వెంటనే లబ్ధిదారుడి పేరుతో ప్రభుత్వం ఐఎఫ్ఎస్ కోడ్తో బ్యాంకు ఖాతాను ప్రారంభించనున్నది. ఈ ఖాతాలతో పోడు పట్టాల లబ్ధిదారులకు రైతుబంధును అందజేయనున్నది. కాగా, పోడు భూముల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకున్నది. అర్హులైన గిరిజనులకు కచ్చితంగా హక్కులు దక్కేలా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది.
గ్రామపంచాయతీల పరిధిలోని అటవీ హక్కుల కమిటీల ఆధ్వర్యంలో నెలలపాటు సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించారు. రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సంతకాలతో పోడు భూముల పట్టాలను రూపొందించారు. అర్హులకు పోడు పట్టాల పంపిణీ అనంతరం అడవులు అన్యాక్రాంతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పక్కగా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు, అటవీ భూములను వేరు చేసేలా అత్యాధునిక పాలిగన్ సాంకేతిక పరిజ్ఞానంతో సర్వేలు నిర్వహించింది. భవిష్యత్లో భూమి హద్దు వివాదాలు రాకుండా, పక్కన ఉన్న అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా పాలిగన్ విధానం ఉపయోగపడుతున్నది.