వరంగల్చౌరస్తా, మే 27 : ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానపై పాలకుల పట్టింపు లేకుండా పోయింది. ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. నిత్యం వేలాది మందికి ఔట్ పేషెంట్, వందల మంది ఇన్ పేషెంట్ సేవలు, పదుల సంఖ్యలో శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న ఎంజీఎంహెచ్ను పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమస్యలపై దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉండగా సంవత్సరాలు గడుస్తున్నా మీటింగ్ ఊసేలేకుండా పోయింది. దీంతో దవాఖానలో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి.
హాస్పిటల్ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, కావాల్సిన నిధులు, అనుమతులపై చర్చించి, ఏ విభాగానికి ఏ అవసరాలు ఉన్నాయి? ఎన్ని నిధులు కేటాయించాలి ? ఏ యంత్రాలు, పరికరాలు కొనుగోలు చేయాలి? ఎంత మంది సిబ్బందిని నియమించాలని తీర్మానించాల్సిన కమిటీ నిర్లక్ష్యం చేయడంతో పేదలకు అందాల్సిన సేవలు దూరమవుతున్నాయి. నిత్యం వేలాది మందికి సేవలందించే హాస్పిటల్లో ఓ వైపు సిబ్బంది కొరత, మరో వైపు నిధుల కొరత, పని చేయకుండా తరుచూ మొరాయిస్తున్న యంత్ర పరికరాలతో సేవలను కొనసాగించడం వైద్యులకు కత్తిమీద సాములా మారుతున్నది.
వేదిస్తున్న సిబ్బంది కొరత
అవసరమైన వైద్య సిబ్బంది సరిపోక ఉన్న వారితోనే సేవలను కొనసాగిస్తున్నారు. సిబ్బంది కొరతతో వైద్యసేవల్లోనే కాకుండా ఇతర విభాగాల్లో సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఎంజీఎంహెచ్ బ్లడ్ బ్యాంకులో మోటివేటర్ లేకపోవడంతో రక్తదాన శిబిరాలు నిర్వహించలేకపోతున్నారు. దీని కారణంగా దవాఖాన అవసరానికి తగినంత రక్తం నిల్వలను కొనసాగించలేకపోతున్నారు. పారా మెడికల్, రేడియాలజీ టెక్నికల్, ఔట్సోర్సింగ్ సిబ్బంది సైతం తగినంత మంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పరిపాలనా విభాగం ఉద్యోగులే చెప్తున్నారు.
మొరాయిస్తున్న యంత్రాలు
రోగులకు అవసరమైన పరీక్షలు చేసేందుకు తగినన్ని యంత్రాలు, పరికరాలు అందుబాటులో లేకపోవడంతో పరీక్షలకు ఎక్కువ సమయం పడుతున్నది. ముఖ్యంగా అత్యవసర విభాగంలో పారా మెడికల్ పరీక్షలు నిర్వహించుకోవడానికి ఎక్కువ సమయం పడుతున్నది. ఇటీవల 13 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని డీఎంఈ అదేశాల మేరకు తొలగించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు చెప్తున్నారు. ఈసీజీ మిషన్లకు సైతం కొరత ఉంది. టూడీ ఈకో పరీక్షలు నిర్వహించడం కోసం పేషెంట్లను ప్రత్యేక అంబులెన్స్ల ద్వారా కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించాల్సి వస్తున్నది. ఎక్స్రే మిషన్ తరుచూ మొండికేయడంతో రేడియాలజీ విభాగానికి, లేదా సూపర్ స్పెషాలిటీకి వెళ్లాల్సి వస్తున్నది.
కేపాసిటీకి మించి ఎక్స్రే తీయడం వల్ల తరుచూ డిజిటల్ ఎక్స్రే మిషన్ సైతం మొరాయిస్తున్నట్లు సంబంధిత విభాగం వైద్యాధికారులు చెప్తున్నారు. రసాయనాల కొరత కారణంగా పారా మెడికల్ పరీక్షలు నిర్వహించలేకపోవడం వల్ల రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ని సంప్రదించాల్సిన సందర్భాలూ లేకపోలేదు. ఒకానొక సందర్భంలో ప్రైవేట్ పారా మెడికల్ సిబ్బంది నేరుగా వార్డుల్లోనే శాంపిల్స్ సేకరించిన సందర్భాలు కోకొల్లలు. దీనికి తోడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తిగా ఎంజీఎంహెచ్ మీదే ఆధారపడడంతో ఎంజీఎంహెచ్కు సూపర్ స్పెషాలిటీ అదనపు భారంగా మారుతున్నది. ఎంజీఎం హాస్పిటల్ని ఇన్ని సమస్యలు బాధిస్తున్నా అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించి మెరుగైన వైద్యసేవలు అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టకపోవడంపై రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.