గ్రామ పంచాయతీల్లో మళ్లీ ప్రత్యేకాధికారుల పాలన రానుంది. నేటితో ప్రస్తుత పంచాయతీ పాలక వర్గాల గడువు ముగియనుండడంతో పల్లెల పాలన అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేకపోవడంతో పదేళ్ల తర్వాత మళ్లీ గ్రామాల్లో ప్రత్యేక పాలన ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం విభాగాల వారీగా అధికారులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. కాగా, మళ్లీ ప్రత్యేకాధికారుల పాలన వస్తే గ్రామాల అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉన్నదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీల పాలక మండలి గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు సుముఖంగా లేదు. 2019 ఫిబ్రవరి నెలలో కొలువుదీరిన పాలకవర్గాల పదవీ కాలం ఫిబ్రవరి ఒకటో తేదీతో ముగియనుంది. గడువు తీరేలోపు ఎన్నికలు నిర్వహించాలి. కానీ పార్లమెంట్ ఎన్నికల అనంతరం పంచాయతీల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంతో హనుమకొండ జిల్లాలోని 208 జీపీలు, వరంగల్ జిల్లాలోని 323, మహబూబాబాద్ జిల్లాలోని 461, జనగామ జిల్లాలోని 281, ములుగు జిల్లాలోని 173, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 241 పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అధికారులను గుర్తించి మండలాల వారీగా జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. తహసీల్దార్, ఎంపీడీవో, పీఆర్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ ఏఈలు, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఎంపీవోలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లతో కూడిన జాబితాను రూపొందించినట్లు తెలిసింది. వీరికి నేడో రేపో గ్రామ పంచాయతీల పాలన బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడూ వాయిదా వేయలేదని, గడువులోగా ఎన్నికలు నిర్వహించే వారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రత్యేకాధికారుల పాలన ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఫిబ్రవరి ఒకటో తేదీతో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియనుంది. గ్రామాల్లో పాలనకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వ మౌఖిక ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ సూచనల మేరకు అధికారులను గుర్తించి జాబితాను సిద్ధం చేశాం. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే అధికారులకు ఆర్డర్స్ అందజేస్తాం.