సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చేతినిండా పనిలేక, ఆర్థిక భరోసానిచ్చే వారు కానరాక సమైక్యపాలనలో ఎన్నో కుటుంబాలు అరిగోస పడ్డాయి. కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ ముందుచూపుతో ప్రవేశపెట్టిన, కొత్తగా తీసుకొస్తున్న పథకాలు వారి జీవనోపాధికి కొత్తదారి చూపుతున్నాయి. తాజాగా వెనుకబడిన కులాల వారికి ప్రోత్సాహాన్నిచ్చేలా రూ.లక్ష సాయం పథకం కొండంత ధీమానిచ్చింది. ఈ నెల 9న మంచిర్యాలలో లాంఛనంగా ప్రారంభం కాగా సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం వృత్తి పని చేసుకునే కుటుంబాల్లో సంతోషం నింపుతోంది. అలాగే రెండో విడుత గొర్రెల యూనిట్లు అందుకన్న గొల్లకుర్మలు సీఎం కేసీఆర్ తమ జీవితాల్లో కొత్త వెలుగు నింపారని సంతోషపడుతున్నారు. ఇక ఎవరిపైనా ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతో దివ్యాంగుల పింఛన్ను రూ.4016కి పెంచుతామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన వారిలో మరింత ఆత్మవిశ్వాసం పెంచింది. గూడు లేని నిరుపేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఇండ్ల పట్టాలు అందించి వారి చిరకాల కోరిక నెరవేర్చారు. ఇలా అన్ని వర్గాల వారికి ఏదో ఒక రూపంలో సాయం అందిస్తుండడంపై సంబురాలు వెల్లువెత్తాయి. శనివారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు.
వరంగల్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ పెంచాలని గతంలో ఆందోళనలు చేశాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ధర్నా, రాస్తారోకోలు నిర్వహించాం. కొట్లాడంగ కొట్లాడంగా రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం రూ.200 నుంచి రూ.500కి పెంచింది. కానీ అవి ఎటూ సరిపోకపోయేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆరే దివ్యాంగులను ఆదుకుంటున్నడు. స్వరాష్ట్రంలో మొదట రూ.500 నుంచి రూ.1,500కు పెంచిండు. తర్వాత డబుల్ చేసిండు. నెలనెలా రూ.3,016 పింఛన్ ఇస్తున్నడు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, దివ్యాంగులు ఏం పని చేసుకోలేరనే భావనతో కేసీఆర్ పెద్ద మనుసుతో వచ్చే నెల నుంచి రూ.వెయ్యి పెంచి రూ.4,016 చొప్పున ఇస్తామని ప్రకటించారు. దివ్యాంగుల పింఛన్ పెంచడం హర్షణీయం. ఆయనకు రుణపడి ఉంటం.
– నూకల కృష్ణమూర్తి, జాగృతి దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
కాటారం, జూన్ 10 : ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు స్కూటీలు, పెన్షన్ పెంచి మనోధైర్యం కల్పించారు. పుట్టుక నుంచి దివ్యాంగులుగా సమాజంలో బతకడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుండేవాళ్లం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లనిచూపుతో దివ్యాంగులకు ఒక్కసారిగా పెన్షన్ పెంచి భరోసా ఇచ్చిండు. ఇప్పుడు ఆ పెన్షన్ను మరో రూ.1000 పెంచి పెద్ద మనసు చాటుకున్నడు. అంతేగాక దివ్యాంగులకు స్కూటీ వాహనాలు ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నం. ఇసోంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు సూడలేదు. మా పాలిట దేవుడిలా మా బాగు కోసం ఇంత చేస్తున్న సీఎం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలె. అటు పెన్షన్, ఇటు స్కూటీ వాహనాలతో సగం తిప్పలు తప్పినయ్.
– గుగులోత్ దేవరాజ్, కాటారం
ధర్మసాగర్, జూన్ 10 : సీఎం కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తిదారులకు రూ.లక్ష సాయం పథకం బాగుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా కుటుంబానికి ఎలాంటి లబ్ధి చేకూరలేదు. మమ్ముల్ని కనీసం గుర్తించలేదు. మాది పూసబేర్ల కులం. వృత్తిపరంగా మేము ఇంటింటికీ, పలు గ్రామాల్లో తిరిగి గాజులు, బొట్టు బిల్లలు ఇతర చిన్న వస్తువులను అమ్ముకొని బతికేవాళ్లం. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రూ.లక్షతో మరింతగా ఆర్థికంగా ఎదుగుతాం. ఒక కంగన్హాల్ పెట్టుకుంట. వచ్చే డబ్బులతో కుటుంబాన్ని మంచిగ పోషించుకుంట. పిల్లాపాపలతో ఆనందంగా ఉంట. మాలాంటి వాళ్లకు ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుంది.
– పసునూరి అశోక్, ధర్మసాగర్
బచ్చన్నపేట, జూన్ 10 : దివ్యాంగులకు సీఎం కేసీఆర్ కొండంత భరోసా ఇచ్చిండు. ఎందుకంటే ఆయనొచ్చినంకనే పింఛన్లు పెంచిండు. ఇదివరకున్న ప్రభుత్వం కంటే భిన్నంగా పాలన సాగిస్తుండు. పోరాడి సాధించిన తెలంగాణలో అందరి కోసం పనులు చేస్తున్నడు. అప్పట్లో పింఛన్ నెలకు రూ.500 వచ్చేది. ఇప్పుడయితే నెల వరకే ఠంఛన్గా పింఛన్ ఇస్తున్నరు. ఇప్పుడిచ్చే రూ.3016ను వచ్చే నెల నుంచి 4,116కి పెంచడం అంటే మా గౌరవాన్ని మరింత పెంచడమే. ఆయన చేసిన మేలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. కేసీఆర్ సారే అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేస్తుండు. దివ్యాంగులమైన మాకు పూర్తి భరోసా కల్పిస్తుండు. ఇంత కన్నా ఎక్కువ మాకేం కావాలి. మేమంతా ఆయనకు రుణపడి ఉంటం. ఆయన వెంటే నడుస్తుం.
– ఊడెం రమేశ్, ఆలింపూర్, బచ్చన్నపేట
డోర్నకల్, జూన్ 10 : మాది డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామం. ఇంటి దగ్గరనే ఉంటూ తాతముత్తాతల కాలం నుంచి కుమ్మరి పనిచేసుకుంటూ బతుకుతున్నం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కుమ్మరి పనికి ఆదరణ వచ్చింది. ఎండాకాలంలో మూడు నెలలు మాత్రమే పనికి ఉంటుంది. అప్పుడే చేతిల పైసల్ కనవడ్తయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని కులవృత్తి చేసుకునేటోళ్లకు లక్ష రూపాయలు వస్తున్నయ్. మా లెక్క ఎన్నో కుటుంబాలకు కొండత భరోసా ఇచ్చిండు కేసీఆర్. లక్ష రూపాయల ఆర్థికసాయం కోసం దరఖాస్తు పెట్టకున్నం. కేసీఆర్ ఉండడం వల్లనే కులవృత్తులకు మంచిరోజులు వచ్చినయ్. ఆర్థిక చేయూత అందిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– ఆరెపల్లి ఉమ, తోడేళ్లగూడెం
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : మా కులపోళ్లను ఇంతకుముందున్న కాంగ్రెస్, తెలుగుదేశం సర్కారోళ్లు ఎన్నడు పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సారు మా కుటుంబాలు మంచిగ బతకడానికి జీవాలను ఇత్తాండు. నాక్కూడా గొర్లు వచ్చినయ్. నిన్ననే ఎమ్మెల్యే రమణారెడ్డి సారు చేతుల మీదుగా తీస్కున్న. మంచిగ కష్టపడి సాదుకుంటే తల్లికి పిల్లలై మంద పెద్దగైతది. కుటుంబం మంచిగ గడుత్తది. పుట్టిన పిల్లల్లో సగం అమ్ముకుంటే సాలుకు అన్ని ఖర్చులు పోతయ్. సీఎం కేసీఆర్కు మా కులపోళ్లు అందరం రుణపడి ఉంటం. ఇదివరకు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని దరఖాస్తు చేసుకుంటే పట్టించుకోకపోయేది. ఇప్పుడు సీఎం సారు మా కష్టాన్ని గుర్తించి గొర్రెల పంపిణీ మొదలుపెట్టిండు.
– తొట్ల మల్లయ్య, గొర్రెల పెంపకం లబ్ధిదారుడు, మహబూబ్పల్లి, భూపాలపల్లి మండలం
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : నాకు భూపాలపల్లిలోని సుభాష్కాలనీలో ఓ సింగరేణి కార్మికుడికి సంస్థ ఇచ్చిన వంద గజాల్లో ఉన్న ఇల్లును కొనుక్కున్న. ఆరేండ్లుగా ఆ ఇంట్లనే భార్యాపిల్లలతో ఉంటున్న. పట్టా కోసం ఎంతో ప్రయత్నించిన, ఎందరో అధికారుల చుట్టూ తిరిగిన. ఎవరూ పట్టించుకోలేదు. నాకంటే ముందు కొనుక్కున్న వారు కూడా అప్పటికే తిరుగుతూనే ఉన్నరు. కార్మికుల పిల్లల పేరిట కూడా ఈ ఇండ్ల స్థలాల పట్టా కాలేదు. మా సమస్యను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సార్కు చెప్పినం. సింగరేణి ప్రజల బాధలు సీఎం సారుకు బాగా తెలుసు. 76 జీవో కింద భూములను క్రమబద్ధీకరించి, మాకు పట్టాలు ఇచ్చారు. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఎన్నో ఏండ్లుగా పడ్డ మా బాధలు తీరిపోయినయ్. నాలెక్క 1,600 మందికి పట్టాలు వచ్చినయంటే అది తెలంగాణ సర్కారు వల్లనే.
– అనసూరి గణేశ్, సింగరేణి స్థల క్రమబద్దీకరణ పట్టా అందుకున్న లబ్ధిదారుడు, సుభాష్కాలనీ, భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ చేసిన మేలు మా దివ్యాంగులందరం జీవితంలో మరిచిపోలేము. మా ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి, జీవనోపాధికి సారు ఇస్తున్న పింఛన్, పెంచిన వెయ్యి రూపాయలు ఎంతగానో ఉపయోగపడుతాయి. మాలో ధైర్యం నింపి బతకడానికి దశ, దిశ చూపారు. కుటుంబానికి దివ్యాంగులు భారం కాకుండా ఈ పెంచిన మొత్తం పింఛను మా అవసరాలకు చక్కగా ఉపయోగపడుతది. గౌరవంగా బతికేలా చేసిన కేసీఆర్ సారుకు ధన్యవాదాలు. గృహలక్ష్మి పథకంలో కూడా దివ్యాంగులకు 5శాతం అవకాశం ఇవ్వడం మంచి విషయం.
– గుండెబోయిన నీలాంబరం, దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు
పెద్దవంగర, జూన్ 10 : మాలాంటి నిరుపేదలకు మంచి సౌలతులతోటి ఇల్లు కట్టించినందుకు చాన సంతోషంగా ఉంది. గూడులేని మాకు ఇల్లు కట్టించి మాకు పెద్ద దిక్కుగా ఉన్న సీఎం కేసీఆర్కు, మంత్రి దయాకర్రావుకు రుణపడి ఉంటం. రూపాయి ఖర్చు లేకుంట ప్రభుత్వమే కట్టించింది. కుటుంబానికి కావాల్సిన విధంగా అన్ని వసతులతో ఉండేలా చేసి పట్టాలు కూడా ఇచ్చింది. ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నాం. అంతకుముందు గుడిసెలో ఉండేవా ళ్లం. ఎండకు, వానకు చాలా ఇబ్బంది అయితుండే. వర్షం వస్తే చాలా కష్టమయ్యేది. పేదల కోసం మంచి పనులు చేస్తున్న కేసీఆర్ సర్కారు మేలు మరువం.
– మచ్చ శోభ, కొరిపెల్లి గ్రామం,పెద్దవంగర మండలం
కమలాపూర్, జూన్ 10 : చేతి వృత్తులకు లక్ష రూపాయలు అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. నేను మా కులవృత్తి వడ్రంగి పనిచేసుకుని బతుకున్నా. పనిచేసుకుంటేనే కుటుంబం గడుస్తుంది. కానీ రోజుకు వెయ్యి రూపాయల కూలీ గిట్టుబాటు కావడం కష్టంగా మారింది. బయట పనులు చేయలేక వృత్తినే నమ్ముకుని బతుకుతున్నా. కేసీఆర్ లక్ష రుపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పడం ఊరటనిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయలతో ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం.
– కనుకుల సదయ్య, ఉప్పల్, వడ్రంగి