వరంగల్లోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్ధరణ పనుల్లో వేగం పుంజుకుంది. దాదాపు 90శాతం పూర్తవడంతో త్వరలో ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. రూ.కోటీ 60 లక్షల కుడా నిధులతో గార్డెన్ పనులు చేపట్టగా పూర్వవైభవం సంతరించుకొని చూడచక్కని అందాలతో ఆకట్టుకోనున్నది.
1996లో అప్పటి కమిషనర్ శాలినీమిశ్రా ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన మ్యూజికల్ గార్డెన్ను కొన్నేళ్లు బాగానే నిర్వహించారు. నగర ప్రజలు ఆహ్లాదం కోసం పెద్ద సంఖ్యలో గార్డెన్కు వచ్చేవారు. క్రమంగా నిర్వహణ సరిగా లేకపోవడంతో ఆదరణ తగ్గిపోయింది. దీంతో రెండు సంవత్సరాలుగా మ్యూజికల్ గార్డెన్ను మూసివేశారు. ఏడాది కిత్రం కుడా నిధులతో గార్డెన్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. అప్పటినుంచి నత్తనడకన సాగిన పనుల్లో ఇప్పుడు వేగం పెంచారు. త్వరలోనే మళ్లీ మ్యూజికల్ గార్డెన్ను ప్రారంభించి పూర్వవైభవం తీసుకొచ్చేలా అధికారులు కార్యాచరణ చేస్తున్నారు.
కాకతీయ మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. మ్యూజికల్ గార్డెన్లో ముందుబాగంలో గ్రీనరీ పనులు దాదాపుగా పూర్తిచేశారు. చిన్నారుల కోసం ఆట వస్తువులను ఏర్పాటుచేశారు. ఫుట్పాత్లను టైల్స్తో అందంగా తీర్చిదిద్దారు. మ్యూజికల్ గార్డెన్లోని రెండు బ్రిడ్జిలను అందంగా ముస్తాబు చేశారు. గతంలో బ్రిడ్జిలకు పైకప్పు ఉండేది కాదు. పునరుద్ధరణలో భాగంగా ఇప్పుడు బ్రిడ్జిలకు పైకప్పులతో పాటు గ్రానైట్ టైల్స్ వేశారు. దీంతో బ్రిడ్జిలు అందంగా కనిపిస్తున్నాయి.
కాకతీయ మ్యూజికల్ గార్డెన్లో రెండు మ్యూజికల్ ఫౌంటేన్లను ఏర్పాటు చేయనున్నారు. గార్డెన్కు వచ్చే సందర్శకులకు వీనుల విందైన సంగీతానికి అనుగుణంగా నాట్యం చేసే ఫౌంటేన్లను ఏర్పాటు చేయనున్నారు. గార్డెన్ వెనుకబాగంలో ఒక ఫౌంటేన్, మధ్యలో ఒక ఫౌంటేన్ ఏర్పాటుచేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫౌంటేన్లకు సంబంధించిన సంస్థలు కోటేషన్లు అందజేశాయని తెలిపారు. ఇటీవల మ్యూజికల్ గార్డెన్లో పురోగతి పనులను కుడా ఈఈ భీమ్రావు, హార్టికల్చర్ అధికారి వేణుగోపాల్, ఏఈ సిద్దార్థనాయక్లు పరిశీలించారు. గార్డెన్లో మరికొన్ని సౌకర్యాలు కల్పిస్తే వంద శాతం పనులు పూర్తి అయినట్టేనని అధికారులు చెబుతున్నారు. గార్డెన్లో మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.