పర్వతగిరి, జనవరి 27 : పర్వతగిరి పర్వతాల శివాలయ పునఃప్రతిష్ఠాపన వేడుకలు రెండో రోజు గురువారం కనుల పండువగా సాగాయి. ఉదయం సుప్రభాత సేవతో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శివాలయంలో ఉదయం వేద సృష్టి, దేవతామూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. గుట్ట కింద కుంకుమ పూజలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆర్డీఎఫ్ కార్యదర్శి ఎర్రబెల్లి రామ్మోహన్రావు నేతృత్వంలో వలంటీర్లు భక్తులకు అన్ని వసతులను కల్పించారు.
రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దంపతులు..
శివాలయంలో నిర్వహించిన మహాలింగార్చన, పంచామృత రుద్రాభిషేకం కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు-ఉషా దంపతులు హాజరయ్యారు. మంత్రి కుమారుడు ప్రేమ్ చందర్రావు దంపతులు, సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు దంపతులు, ఎంపీటీసీ మాడ్గుల రాజు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. శివాలయానికి ఈనెల 28న మంత్రి హరీశ్రావు వస్తున్నారని ఎర్రబెల్లి చెప్పారు.
శివయ్యను దర్శించుకున్న ప్రముఖులు..
పర్వతాల శివయ్యను ఎమ్మెల్యే అరూరి రమేశ్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ కవిత, వరంగల్ సీపీ రంగనాథ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జనగామ కలెక్టర్ శివ లింగయ్య, ఎంపీ బండా ప్రకాశ్, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా దంపతులు దర్శించుకున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుహాసిని, ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్ సీఎండీలు ప్రభాకర్రావు, గోపాల్రావు, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, డీఆర్డీవో సంపత్రావు, ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్, డీసీపీ వెంకటలక్ష్మి, ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగ్లాల్, మనోజ్కుమార్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, సోమేశ్వర్రావు, సందెల నవీన్, బీఆర్ఎస్ యూత్ నాయకులు చింతకుంట్ల రంజిత్, ఆర్టీసీ వరంగల్-1 డిపో ఎస్టీఐ భవానీ, రామకృష్ణ సేవా సమితి ప్రతినిధి చిదురాల చంద్రశేఖర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులతో కలిసి ఎమ్మెల్యే అరూరి భోజనం..
పర్వతగిరి : పర్వతాల గుట్ట శివాలయానికి వస్తున్న భక్తుల కోసం అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ మహా అన్నదానం ఏర్పాటు చేశారు. గురువారం అన్నదాన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం భక్తులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. అనంతరం టూరిజం శాఖ ఆధ్వర్యంలో పెద్ద చెరువు రిజర్వాయర్లో ఏర్పాటు చేసిన బోటింగ్ను ప్రారంభించారు. సరదాగా కొద్ది సేపు బోటింగ్ చేశారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, సోమేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్, ఎంపీటీసీ మాడ్గుల రాజు, రంగు కుమార్గౌడ్, జనార్దన్గౌడ్ తదితరులు ఉన్నారు.
బోటింగ్ చేస్తూ ఎంజాయ్..
శివాలయం గుట్ట కింద ఉన్న పెద్ద చెరువు రిజర్వాయర్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ బోటింగ్ చేశారు. భక్తుల కోసం రెండు బోట్లను అందుబాటులో ఉంచినట్లు మంత్రి చెప్పారు. అలాగే, గుట్ట కింద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. సినీ గాయని మధుప్రియ బృందం హంగామా చేసింది. కాగా, పర్వతాల శివాలయం పునఃప్రతిష్ఠాపనోత్సవాలకు మంత్రి హరీశ్రావు శనివారం వస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.