జయశంకర్ భూపాలపల్లి, మే 13 (నమస్తే తెలంగాణ) : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పూర్తిగా అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లింది. వారి కనుసన్నల్లోనే సంఘం కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లడం, వారి ఇష్టారాజ్యంగా తూకాలు వేయడం.. సహకార సంఘం అధికారులు నామమాత్రపు విధులకు పరిమితం కావడం ప్రస్తుతం గ్రామాల్లో హాట్ టాఫిక్గా మారింది.
ధాన్యం కొనుగోలు విషయమై ప్రశ్నిస్తే ‘మా ఎమ్మెల్యేకు చెప్తాం.. అక్కడికి వచ్చి మాట్లాడండి’ అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, సొసైటీ అధికారులకు చెప్పినా వారు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని, దీంతో చేసేది లేక నష్టానికైనా ధాన్యంను అమ్ముకోవాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అమ్మిన ధాన్యం.. దాని విలువ సైతం రాసివ్వడం లేదని, నెల రోజుల క్రితం అమ్మిన మక్కలకు ఇంతవరకు డబ్బులు రాలేదని, ఎంత వస్తాయో కూడా తెలియదని పేర్కొంటున్నారు. తమకు తెలిసినంత వరకు తక్కువలో తక్కువ ఒక్కో రైతు కనీసం రూ. 20 వేలకు పైగానే నష్టపోతున్నాడని చెప్తున్నారు.
ధాన్యం కొనుగోలులో అలసత్వం
జిల్లాలో మొత్తం 49,528 ఎకరాల్లో మక్కజొన్న సాగవగా 45 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఏడు సెంటర్ల ద్వారా 19వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అతికష్టం మీద కొనుగోలు చేసి, 14,897 మెట్రిక్ టన్నులు ట్రాన్స్పోర్టు చేశారు. కొనుగోలు చేసి నెల దాటుతున్నా ఇంతవరకు రైతులకు డబ్బులు అందలేదు. ఒక్కో గన్నీ సంచికి రూ.30 వెచ్చించి కొనుగోలు చేసుకుంటున్న రైతులకు సంచుల డబ్బుల చెల్లింపు ఊసే లేదు. కేవలం సంచికి రూ.21 మాత్రమే చెల్లిస్తామని మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నా అవి ఎప్పుడు వస్తాయో తెలియదు.
అలాగే జిల్లాలోని 12 మండలాల్లో లక్షా 60 వేల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటి వరకు 12 వేల టన్నుల వడ్లను 110 కేంద్రాల ద్వారా మాత్రమే కొనుగోలు చేశారు. వడ్లు, మక్కలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో కొనుగోలు చేసి నెలరోజులు దాటుతున్నా ఇప్పటి వరకు 20 శాతం ధాన్యం సైతం కొనుగోలు చేయకపోవడం వైఫల్యమేనని, ధాన్యం వర్షం పాలైతే ప్రభుత్వమే బాధ్యత వహించాలని రైతులు హెచ్చరిస్తున్నారు.

Warangal2
బస్తాకు కిలోన్నర దోపిడీ
ఒకవైపు పండించిన పంటను సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వర్షంతో నష్టపోతున్న అన్నదాతలకు అధికార పార్టీ నేతలు తూకంలోనూ షాక్ ఇస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. బ్యాగు బరువుతో కలిపి 50,580 కేజీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తూకం వేసి కొనుగోలు చేయాల్సి ఉండగా 52 కిలోల నుంచి 52,500 కిలోల వరకు తూకం వేస్తున్నారని, తాము ఒక్కో బస్తాకు సుమారు కిలోన్నర ధాన్యం నష్టపోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు.
దీంతో పాటు రూ.30 వెచ్చించి గన్నీ బ్యాగులు కొంటూ ట్రాన్స్పోర్టు చార్జీ తామే భరిస్తున్నామని, హమాలీ చార్జీల కింద క్వింటాకు 3 కిలోల ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. మేము విక్రయించిన ధాన్యానికి రశీదు ఇవ్వడం లేదని, రశీదు ఇస్తే వారి అవినీతి అక్రమాలు బయటపడుతాయి. ఇక వడ్ల విషయానికి వస్తే ఇక్కడ కూడా అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదమని, కేంద్రంలో ఇష్టారాజ్యంగా తూకం వేస్తున్నారని, మిల్లు దగ్గరికి వెళ్లగా అక్కడ రెండు కేజీల వడ్లు తరుగు కింద తీసివేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఆరు క్వింటాళ్లు నష్టపోయా..
నాకున్న రెండు ఎకరాల భూమిలో మక్కజొన్న పండించిన. 66 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గొర్లవీడులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి అమ్మిన. బస్తాకు కిలోన్నర అదనంగా తూకం వేయడంతో పాటు హమాలీ, ట్రాన్స్పోర్టు చార్జీలు కలుపుకుని మొత్తం ఆరు క్వింటాళ్ల వరకు నష్టపోయిన. ఇదేంటని అడిగితే బయట అమ్ముకోపో అని బెదిరిస్తున్నరు. మొత్తం ఎంత తూకం వేశారు, ఎంత తరుగు తీశారు, నాకు రసీదు ఇవ్వండి అంటే ఇవ్వలేదు. అక్కడ మార్క్ఫెడ్, సొసైటీ అధికారులు ఎవ రూ లేరు. అందరూ కాంగ్రెస్ నాయకులే ఉన్నరు. నెల దాటింది ఇంతవరకు డబ్బులు రాలేదు. మూడు నాలుగు నెలలు పట్టవచ్చు అంటున్నారు. మా తండాలో సుమారు 20 మంది అమ్మారు. అందరిదీ ఇదే పరిస్థితి.
– బానోత్ రాములు, రైతు, గొర్లవీడు తండా, భూపాలపల్లి
కిలో 700 అదనపు తూకం వేశారు
నేను 65 క్వింటాళ్ల మక్కలను గొర్లవీడు కేంద్రంకు తీసుకుపోయి అమ్మిన. డబ్బులు ఇంతవరకు రాలేదు. న్లైతాంది. ఒక్కో బస్తాకు కిలో 700 అదనంగా తూకం వేయడంతో చాలా నష్టపోయిన. ఏవేవో సాకులు చెప్పారు. హమాలీ చార్జీ అని, లారీ చార్జీ అని, ఇంకా ఖర్చులు ఉంటాయని తరుగు తీయడంతో సుమారు 3 క్వింటాళ్లకు పైగానే నష్టపోయిన. లెక్కా పత్రం లేదు. వాళ్లు ఇచ్చిందే తీసుకోవాలి. పంట పండించి వాళ్లకే పెట్టుడైతంది. గవర్నమెంట్ కొంటుందన్న పేరే. అంతా మోసమే.
– నంగావత్ సమ్మయ్య, రైతు, గొర్లవీడు తండా, భూపాలపల్లి