గార్ల, మార్చి 10 : ఇద్దరు ఆడపిల్లలను సాకడం భారమనుకున్నారో.. లేక తమ జల్సాలకు అడ్డొస్తున్నారని భావించారో కానీ, ముక్కు పచ్చలారని చిన్నారులను అత్యంత పాశవికంగా హత్య చేశారు తల్లిదండ్రులు. కని పెంచిన ఆ తల్లికి చేతులెలా వచ్చాయో.., అల్లారు ముద్దుగా సాకుతున్న ఆ తండ్రిని ఏం ఆవహించిదో.. కానీ, పేగుబంధాన్ని మరిచి పాలల్లో పురుగు మందు కలిపి ఇద్దరు చిన్నారులకు తాగించారు. వారు విగత జీవులుగా మారడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ హృదయ విదారక ఘటన ఆదివారం గార్ల మండలం సీతంపేట గ్రామ పంచాయతీ శివారు అంకన్నగూడెంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గార్ల మండలం సీతంపేట గ్రామ పంచాయతీ శివారు అంకన్నగూడెం గ్రామానికి చెందిన పెండగట్ల అనిల్కుమార్కు బయ్యారం మండలం నామాలపాడు గ్రామానికి చెందిన దేవితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల లోహిత(2), 11 నెలల జస్విత ఉన్నారు. అనిల్ ట్రాక్టర్ డ్రైవర్గా, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు.
కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారం రోజులుగా వీరు నామాలపాడులోని అత్తమామల వద్ద ఉంటున్నారు. శనివారం సాయంత్రం అంకన్నగూడెం వచ్చారు. రాత్రి భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, ఇద్దరు చిన్నారులకు పాలల్లో పురుగు మందు కలిపి తాగించారు. దీంతో చిన్నారులు విగతజీవులయ్యారు. అనిల్కుమార్, దేవి అక్కడి నుంచి పారిపోయా రు. అదే ఇంట్లో ఉంటున్న చిన్నారుల తాత పెండగట్ల వెంకన్న రోజూ మాదిరిగానే కిరాణా దుకాణానికి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు గమనించి ఇరుగుపొరుగు వారికి తెలిపాడు. మంచం పక్కన పాల డబ్బా, పురుగుమందు డబ్బా పడి ఉన్నాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ తిరుపతి, గార్ల-బయ్యారం సీఐ రవి, ఎస్సై జీనత్కుమార్ అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. వెంకన్న ఫిర్యాదుతో ఎస్సై జీనత్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.