ఏటూరునాగారం, ఏప్రిల్ 14: ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి ఫోర్జరీ సంతకాలతో రూ.50 వేల చొప్పున ఆరుసార్లు (రూ.3లక్షలు) డ్రా చేసి, మరో రూ.50 వేలు డ్రా చేస్తుండగా తల్లీ కొడుకును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. స్థానిక ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కన్నాయిగూడెం మండలం మలకపల్లికి చెందిన కుర్సం లక్ష్మి భర్త దినేష్ పనికి వెళ్తుండగా కరెంట్ వైర్లు తగలడంతో మృతి చెందాడు. నామినీగా ఉన్న లక్ష్మికి బీమా కింద రూ.10 లక్షలు వచ్చాయి. ఇందులో రూ.3 లక్షల వరకు ఖర్చు కాగా, రూ.3 లక్షలు పిల్లల పేర ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. మిగిలిన రూ.4 లక్షలను పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటూరునాగారం శాఖలోని తన ఖాతాలో నిల్వ ఉంచింది. కాగా లక్ష్మి కుమారుడు బామయ్యతో బ్యాంకుకు రాగా అక్కడ కొడుకు స్నేహితుడు ముప్పనపల్లికి చెందిన సల్లూరి రంజిత్ కలిశాడు. మాయమాటలు చెప్పి లక్ష్మికి చెందిన బ్యాంకు పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకున్నాడు. ఆతర్వాత ఒక రోజు రంజిత్ తన తల్లి సల్లూరి లక్ష్మిని బ్యాంకుకు తీసుకొచ్చాడు.
క్లర్క్ వద్దకు వెళ్లి పాస్బుక్, ఆధార్ జిరాక్స్ ఇచ్చి తన తల్లి కుర్సం లక్ష్మి అని క్లర్కుకు అబద్ధం చెప్పాడు. బ్యాంకు పాస్బుక్ పోయిందని, తమకు కొత్తది ఇవ్వాలని దరఖాస్తు చేశాడు. దీనిని నమ్మిన బ్యాంకు క్లర్క్ కొత్త పాస్బుక్ ఇచ్చాడు. అదే సమయంలో ఖాతాలో ఎంత నగదు ఉందో చెప్పాలని క్లర్క్ కోరగా, రూ.4 లక్షలు ఉన్నట్లు వెల్లడించాడు. వెంటనే విత్డ్రాయల్ ఓచర్పై తల్లితో వేలిముద్ర వేయించి, తెలిసిన వ్యక్తితో విట్నెస్ సంతకం చేయించి రూ.50 వేలు డ్రా చేశాడు. తల్లీ కొడుకులు కలిసి ఇలా ఆరుసార్లు రూ.50 వేల చొప్పున రూ.3 లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేశారు. ఐదోసారి డబ్బులు డ్రా చేసేందుకు విట్నెస్గా ముప్పనపల్లికి చెందిన కాటమ్రెడ్డితో సంతకం చేయించాడు. ఇక ఆరోసారి రూ.50 వేలు డ్రా చేసేందుకు కాటమ్రెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేశాడు.
గత ఫిబ్రవరిలో కుర్సం లక్ష్మికి రూ.10 వేలు అవసరం ఉండగా ముప్పనపల్లిలోని బ్యాంకు సర్వీస్ సెంటర్కు వెళ్లి డ్రా చేసుకుంది. ఆతర్వాత ఖాతాలో ఎంత ఉందో చెప్పాలని కోరగా రూ.90 వేలు ఉన్నట్లు సర్వీసు నిర్వాహకుడు చెప్పాడు. దీంతో అవాక్కైన ఆమె ఖాతాలో రూ.3.90 లక్షలు ఉండాలని ఆరా తీసింది. ఏదో మోసం జరిగిందని భావించి బ్యాంకు మేనేజర్కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మరుసటి రోజు మరో రూ.50 వేలు డ్రా చేసేందుకు సల్లూరి రంజిత్ తల్లితో కలిసి బ్యాంకుకు వచ్చాడు. ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా చేస్తున్నట్లు గుర్తించిన క్లర్క్ అతడిని నిలదీశాడు. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. తన ఖాతా నుంచి రంజిత్ అక్రమంగా డబ్బులు డ్రా చేశాడని కుర్సం లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల దర్యాప్తు
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. బ్యాంకులోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. శుక్రవారం ఏటూరునాగారం బస్టాండ్లో సల్లూరి రంజిత్, తల్లి లక్ష్మితో కలిసి ఉన్నట్లు సమాచారం రాగా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. వీరి నుంచి రూ.1.50 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మోసపూరితంగా డబ్బులు డ్రా చేయడం, ఫోర్జరీ సంతకాలు చేయడంతో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కాగా, విధులపై నిర్లక్ష్యం వహించిన బ్యాంకు ఉద్యోగిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.